Sajjala Ramakrishna Reddy Borugadda Allegations: వైఎస్సార్‌సీపీలో అంతర్గత రాజకీయ విబేధాలు రోడ్డున పడుతున్నాయి.   గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాసం ముందు వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు బోరుగడ్డ అనిల్ కుమార్  ధర్నా  నిరసన చేపట్టడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. జగన్‌మోహన్ రెడ్డిని నేరుగా కలిసి పార్టీ అంతర్గత వ్యవహారాలు, తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకు ప్రయత్నిస్తుంటే మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. 

Continues below advertisement

జగన్‌ను కలవకుండా చేస్తున్నారని సజ్జలపై ఆరోపణలు 

సజ్జల రామకృష్ణారెడ్డి తన స్వప్రయోజనాల కోసం, పార్టీలోని కొందరు కీలక నేతలను అధినేతకు దూరం చేస్తున్నారని బోరుగడ్డ అనిల్ ఆరోపించారు. సజ్జల తన అనుచరులు, సోషల్ మీడియా విభాగం ద్వారా తనపై కావాలనే  రౌడీషీటర్ అనే ముద్ర వేసి తీవ్రమైన దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీ వైఖరి మారలేదని, పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన నాయకులను పక్కనబెట్టి సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

Continues below advertisement

సజ్జల వర్గం నాయకులపై ఆరోపణలు       

తన పరువుకు భంగం కలిగించేలా సాగుతున్న ఈ ప్రచారంపై బోరుగడ్డ అనిల్ స్పష్టత ఇచ్చారు. తనపై ఎలాంటి రౌడీషీట్ లేదని, ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం  సైతం స్పష్టంగా ధృవీకరించిందని ఆయన గుర్తుచేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, చట్టాన్ని లెక్కచేయకుండా తనపై అసత్య ప్రచారాలు కొనసాగిస్తున్న వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా హ్యాండ్లర్లు ,  సజ్జల వర్గానికి చెందిన నాయకులకు ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. న్యాయపోరాటం ద్వారా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.         

రౌడీషీటర్ ముద్ర వేస్తున్నారని విమర్శలు   

అసత్య ఆరోపణలతో తన సామాజిక విలువను తగ్గించి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై సంబంధిత జిల్లా పోలీసు యంత్రాంగం మరియు చట్టబద్ధ అధికారులు తక్షణమే తీవ్రమైన చర్యలు తీసుకోవాలని బోరుగడ్డ అనిల్ డిమాండ్ చేశారు. జగన్‌మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కొందరు నాయకులు వైఎస్సార్‌సీపీకి నిజమైన మద్దతుదారులను దూరం చేస్తున్నారని, ఈ వ్యవహారాన్ని స్వయంగా జగన్ దృష్టికి తీసుకెళ్లే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ అనూహ్య నిరసనతో తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద కాసేపు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.  

వైసీపీలో పెరుగుతున్న వర్గ పోరాటం         

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ అంతర్గత వివాదాలు రచ్చకెక్కుతున్నాయి.   తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వద్ద భద్రతను దాటుకుని స్వయంగా పార్టీ అనుబంధ నాయకుడే నిరసనకు దిగడం, అందునా సజ్జల రామకృష్ణారెడ్డి లక్ష్యంగా ఆరోపణలు చేయడం పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, జగన్ చుట్టూ ఉన్న కోటరీపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో సుదీర్ఘకాలంగా ఉన్న అసంతృప్తి ఈ నిరసనతో మరోసారి బహిర్గతమైందని  భావిస్తున్నారు.