Hyderabad News : హైదరాబాద్ లోని తిరుమలగిరిలో ముగ్గురు బాలికలు అదృశ్యం అయ్యారు. స్థానికంగా ఈ వార్త సంచలనం రేపుతోంది. పుట్టిన రోజు వేడుకల కోసం వెళ్తున్నామని చెప్పి బయటకు వచ్చిన ముగ్గురు బాలికలు కనిపించకుండా పోయారు. 24 గంటలు గడిచినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తు్నారు. త్వరగా తమ పిల్లలను వెతికి క్షేమంగా ఇంటికి చేర్చాలని పోలీసులను వేడుకుంటున్నారు. 


అసలేం జరిగిందంటే..?


హైదరాబాద్ లోని తిరుమలగిరికి చెందిన మరియా అనే బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది.  ఆమె పుట్టిన రోజు సందర్భంగా స్థానికంగా ఉన్న స్నేహితులు హసీనా, సక్నతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ముగ్గురూ కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. నిన్న ఉదయం వెళ్లిన బాలికలు నేటికీ ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు వెతుకులాటలు మొదలు పెట్టారు. ఫోన్లు చేస్తుంటే ముగ్గురి ఫోన్ లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. ఎలాంటి ఆచూకీ లబించకపోవడంతో ఆందోళన ఎక్కువైంది. రాత్రంతా టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన విషయమంతా పోలీసులకు వివరించి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలికల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


వారం రోజుల క్రితం వర్ధన్నపేటలో కూడా ఇలాంటి ఘటనే..!


ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో చోటు చేసుకుంది. రాత్రి 8వ తరగతికి చెందిన విద్యార్థి సెల్ ఫోన్ మాట్లాడడాన్ని తోటి విద్యార్థులు గమనించారు. వెంటనే వారు వార్డెన్ కు సమాచారం ఇవ్వడంతో విద్యార్థి వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకున్నాడు. అనంతరం వార్డెన్ ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం టిఫిన్ చేసే క్రమంలో 8వ తరగతి బాలికలు ఇద్దరు.. 9వ తరగతి చెందిన మరో బాలిక కనిపించలేదు. దీంతో వారి గదిలో ఉండే విద్యార్థులను ఆరా తీయగా.. ఉదయం బయటికి వెళ్లిపోయారని చెప్పారు. వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన హాస్టల్ వద్దకు చేరుకున్నారు. బంధువులు,స్నేహితుల వద్ద వాకబు చేయగా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్డెన్ స్వరూప తెలిపారు. 


గతేడాది డిసెంబర్ లోనూ బాలిక అదృశ్యం..


హైదరాబాద్‌ కవాడిగూడకు చెందిన 13 ఏళ్ల బాలిక అదృశ్య ఘటన కలకలం రేపింది. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లడంతో 2022 డిసెంబర్ 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు బాలిక కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లడంతో బాలిక ఒంటరిగా ఇంట్లోనే ఉంటుంది. ఎవరూ లేని సమయంలో బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు తండ్రి ఆఫీస్ నుంచి ఫోన్ చేయగా.. బాలిక ఎంతసేపటికీ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానంతో తండ్రి హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా.. కూతురు కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల నుంచి బాలిక వివరాలు సేకరించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఎలాంటి లాభం లేకపోయింది.