Hyderabad News: హైదరాబాద్ లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కోట్ల విలువ చేసే స్థలాలను దొంగతనంగా అమ్ముకుంటున్న ముఠాను ఎల్బీ నగర్ ఎసేఓటీ, హయత్ నగర్ పోలీసుల పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు, 9 చరవాణులు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. అసలైన యజమాని లేని భూముల డాక్యుమెంట్ కాపీలను రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సేకరిస్తున్నారు. భూమిని ఎక్కువ రోజులు పట్టించుకోని యజమానుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ.. అనంతరం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వేరే వాళ్ళకి ఆ భూములు అమ్ముతూ  అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.


ఈ కేసులో సందీప్ కుమార్ ప్రధాన నిందితుడని ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. ఇతనిపై గతంలో పలు కేసులు కూడా ఉన్నట్లు గుర్తించారు. సందీప్ కుమార్ ఒక్కడే కాకుండా మరో నలుగురితో కలిసి ఈ నేరాలకు పాల్పడ్డట్లు పేర్కొన్నారు. ఈ కేసులో చంద్రశేఖర్ అనే స్థిరాస్తి మధ్యవర్తి కీలకంగా వ్యవహరిస్తున్నడని ఎల్బీనగర్ ఎస్ఓటీ సీఐ సుధాకర్ తెలిపారు. ఫొటో లేని డాక్యుమెంట్లు సందీప్ కి ఇస్తుండగా... వీటిని నెమలిపురి తరుణ్, బొమ్మ రామరావుతో కలిసి ఇతరులకు విక్రయిస్తున్నట్లు వివరించారు. నిజమైన యజమానికి దగ్గర వయస్సున్న వ్యక్తిని యజమానిగా చూపి స్థలాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారని స్పష్టం చేశారు. ఎవరైనా భూములు కొనుగోలు చేయాలనుకునే వాళ్లు ఇలాంటి వాళ్ల మోసాల్లో పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేసే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఒకటికి పది సార్లు భూమి ఎవరిది, దానికి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. 


నిన్నటికి నిన్న వరంగల్ లో నకిలీ ఎన్ఐఏ అధికారి అరెస్ట్..


ఎన్ఐఏ అధికారి పేరుతో ప్రజలను బెదిరిస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న నిందితుడితోపాటు మరో ఇధ్దరు దొంగలను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఆర్మీ యూనిఫారం, ల్యాప్ టాప్, నకిలీ గుర్తింపు కార్డు, ఎయిర్ రైఫిల్, రెండు ద్విచక్రవాహనాలు, ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వెల్లడించారు. 


నల్గొండ జిల్లా అదిసర్లపల్లి మండలం పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన నార్ల నరేష్ ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం దూర విద్యలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే జల్సాలకు అలావాటు పడ్డాడు. ఎలాగైనా సరే ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం ఓ పథకం వేశాడు. అందులో భాగంగానే ఆర్మీ యూనిఫారం, ఎయిర్ పిస్టల్ తోపాటు నకిలీ గుర్తింపు కార్డును తయారు చేసుకున్నాడు. గ్రామస్థులందరికీ ఆర్మీలో పని చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకున్నాడు. ఊళ్లోని యువకులకు మర్చంట్ నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఐదుగురు వ్యక్తుల నుంచి ఐదు లక్షల రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేశాడు. శిక్షణ పేరుతో మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని వైష్ణవి కెరియర్ ఫౌండేషన్ లో చేర్పించాడు. తాము మోసపోయినట్లుగా గుర్తించిన సదరు యువకులు.. తల్లిదండ్రులకు విషయం తెలిపారు. దీంతో వారు గొడవ చేయడంతో ఎవరి డబ్బులను వాళ్లకు ఇచ్చేశాడు. 


ఆ తర్వాత కూడా నిందితుడిలో ఎలాంటి మార్పూ లేదు. ఇటీవల ఎన్ఐఏ అధికారులు దేశంలో పిఎఫ్ఐతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇండ్లల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను చూశాడు. తాను కూడా ఎన్ఐఏ అధికారిగా మారి అక్రమంగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. వెంటనే నకిలీ ఐడీకార్డు సృష్టించుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులను పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తు ఎయిర్ పిస్టల్ తో బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులను డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వని పక్షంలో జైలుకు పంపిస్తానని బెదిరించిన సంఘటలో బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నకిలీ ఎన్ఐఏ అధికారిని పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి ఆర్మీ యూనిఫారంతో పాటు ఎయిర్ పిస్టల్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకోని విచారించగా.. చేసిన తప్పులన్నింటిని అంగీకరించాడు. గతంలో జగిత్యాల జిల్లాలోను ఇదే తరహలో నేరాలకు పాల్పడినట్లుగా అంగీకరించాడు.