Manikonda News: మణికొండలో ఓ కారులో మృతదేహం లభించడం కలకలం రేపింది. ఓ మారుతి వాన్ లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే వారు 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. కారు వెనుక సీటులో మృతదేహం ఉంది. ఇది హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యక్తి ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? అనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. కారు నెంబరు ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. అంతేకాక, స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీనికి కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.


పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం మృతుడిని రమేష్ గా గుర్తించారు. ఈయన ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్నట్లుగా గుర్తించారు. నిన్న ఉదయం ఇంటి నుంచి రమేష్ బయటకు వెళ్లారు. మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద కారు లో రమేష్ మృతదేహం లభ్యం అయింది. రమేష్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతని నోటిలో నుంచి రక్త స్రావం ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల సమాచారంతో ఘటన స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఈ ఘటనపై భార్య పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.