Naveen Murder Case :  తన లవర్ తో క్లోజ్ గా ఉంటున్నాడని స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటన ఇటీవల హైదరాబాద్ లో సంచలనం అయింది. నవీన్ హత్య రిమాండ్ రిపోర్టర్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రేమకి అడ్డున్నాడనే నవీన్ ను హత్య చేసినట్లు హరిహర కృష్ణ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. మూడునెలల ముందే హత్యకు స్కెచ్ వేసినట్లు వెల్లడించారు. రెండునెలల క్రితం మలక్ పేట్ సూపర్ మార్కెట్ లో హరిహర కృష్ణ కత్తి కొనుగోలు చేశాడు. ఈనెల 17న పక్కా ప్లాన్ ప్రకారం నవీన్ హత్య చేశాడు. హత్యకు ముందు పెద్ద అంబర్ పేట్ వైన్స్ లో నవీన్, హరిహర కృష్ణ మద్యం తాగారు. మద్యం మత్తులో యువతి విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఓఆర్ఆర్ సమీపంలో నిర్మాణుష్య ప్రాంతంలో నవీన్ గొంతునులిమి హత్య చేశాడు హరిహర కృష్ణ. ఆ తర్వాత కత్తితో శరీరాన్ని విడిభాగాలుగా చేశాడు.  తల, వేళ్లు, ఇతర శరీర విడిభాగాలను బ్యాగులో వేసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయాడు హరిహర కృష్ణ. బ్రాహ్మణ పల్లి నిర్మాణుష్య ప్రదేశంలో ఆ బ్యాగును పడేసిన నిందితుడు హరిహర కృష్ణ. 


తిరిగొచ్చి శరీరవిడిభాగాలు సేకరించి దహనం 


"అనంతరం పక్కనే ఉన్న ఫ్రెండ్ హసన్ ఇంటికి వెళ్లాడు హరిహరకృష్ణ. స్నానం చేసి డ్రస్ చేంజ్ చేసుకొని హత్య విషయాన్ని హసన్ చెప్పాడు. మరుసటి రోయు ప్రియురాలికి సైతం హత్య విషయం చెప్పాడు నిందితుడు. ఆ తర్వాత వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖపట్నానికి పరారయ్యాడు. ఈ నెల 24న తిరిగి హైదరాబాద్ కు చేరుకొని హత్య స్పాట్ కు వెళ్లాడు. శరీర విడి భాగాలు సేకరించి వాటిని దహనం చేశాడు. 24 సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు." అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొ్న్నారు. 


గెట్ టుగెదర్ అని పిలిచి మర్డర్ 


ఈ నెల 17న నవీన్‌ను గెట్‌ టుగెదర్‌ పేరుతో పిలిచిన హరిహరకృష్ణ ఆ రోజు రాత్రి వరకూ నవీన్ ఉండేలా ప్లాన్ వేశాడు. సాయంత్రం దాటేవరకు నవీన్ ను ఎల్బీనగర్‌, ఇతర ప్రాంతాల్లో తిప్పాడు. తిరిగి వెళ్లిపోతానని నవీన్‌ చెప్పడంతో నల్గొండలో దింపుతానని బైక్‌పై ఎక్కించుకున్నాడు హరిహరకృష్ణ. హయత్‌ నగర్‌ దాటాక మద్యం తీసుకుని,  అబ్దుల్లాపూర్‌మెట్‌లో ముందే ప్లాన్ చేసుకున్న ప్రాంతానికి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా మర్డర్ చేశాడు. ఈ హత్యలో హరిహరకృష్ణ దుస్తులకు రక్తం అంటుకుంది. అలాగే బయటకెళ్తే అనుమానం వస్తుందని హత్య చేసిన స్థలంలోనే మరుసటి రోజు తెల్లవారుజాము 3 గంటల వరకు ఉన్నాడు. రక్తంతో తడిసిన బట్టలు అక్కడికి సమీపంలోనే విసిరేసి తన వెంట తెచ్చుకున్న కొత్త దుస్తుల్ని వేసుకున్నాడు.  అనంతరం నగరంలోని ఓ స్నేహితుడి ఇంటికి వెళ్లి అక్కడ స్నానం చేశాడు. అక్కడి నుంచి బయల్దేరి వరంగల్‌లోని తండ్రి ప్రభాకర్‌ వద్దకు వెళ్లాడు. అప్పటికే నవీన్‌ కనిపించడం లేదని స్నేహితుల నుంచి హరిహరకృష్ణకు ఫోన్లు రావడంతో ఏం జరిగిందని హరిహరకృష్ణను తండ్రి ప్రశ్నించాడు. అక్కడే ఉంటే తండ్రికి అనుమానం వస్తుందని భావించి  19వ తేదీన పని ఉందంటూ హైదరాబాద్‌ వచ్చాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వేరే చోటికి వెళ్లాడు. 


కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ 


నవీన్ హత్య కేసు నిందితుడు హరిహరకృష్ణను 8 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు హయత్ నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.  హత్య, ఎస్సీ,ఎస్టీ కేసులు నమోదు కావడంతో పిటిషన్ ను రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టుకు బదిలీ చేశారు. చర్లపల్లి జైలులో ఉన్న నిందితుడు హరిహర కృష్ణకు పోలీసులు నోటీసులు అందజేశారు. హరిహర కృష్ణ కస్టడీ పిటిషన్ పై రంగారెడ్డి జిల్లా కోర్టులో రేపు(మంగళవారం) వాదనలు కొనసాగనున్నాయి.