Hyderabad News : హైదరాబాద్ లో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాత్విక్ మృతికి కారకులైన ప్రొఫెసర్ ఆచార్య, వార్డెన్ నరేష్ లతో పాటు కృష్ణా రెడ్డి, జగన్ ను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురికి  నార్సింగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజేంద్రనగర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.  


నలుగురి అరెస్టు 
 
నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల క్లాస్ రూమ్ లో ఇంటర్‌ విద్యార్థి సాత్విక్‌ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాత్విక్‌ సూసైడ్ లెటర్ లో పేర్కొన్న  ప్రొఫెసర్లు ఆచార్య, కృష్ణారెడ్డి, వార్డెన్‌ నరేశ్‌లతో పాటు జగన్‌లపై 305 సెక్షన్‌ కింద నార్సింగి పోలీసులు కేసునమోదు చేసి శుక్రవారం అరెస్టు చేశారు. నార్సింగి ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు  రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చారు. 


 సూసైడ్ లేఖ ఆధారంగా అరెస్టులు 


నలుగురు టీచర్ల వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు సాత్విక్‌ సూసైడ్ లేఖలో రాశాడు. "అమ్మా నాన్న నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలనే ఉద్దేశం లేదు కానీ ఈ మెంటల్‌ టార్చర్‌ వల్లే చనిపోతున్నాను. కళాశాల ప్రిన్సిపల్‌ కృష్ణారెడ్డి, ప్రొఫెసర్లు ఆచార్య, నరేశ్‌, శోభన్‌ హాస్టల్లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోవడం నా వల్ల కావడంలేదు. ఇలాంటి వేధింపులు ఇంకెవరికీ రాకూడదని కోరుకుంటున్నాను. విద్యార్థులను మెంటల్ టార్చర్ చేస్తున్న వీరందరిపై కఠినచర్యలు తీసుకోవాలి" అని సాత్విక్ లేఖలో ఉంది. ఈ లేఖతో పాటు, సాత్విక్‌ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 305 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.


ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య 
 
హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి 10:30 సమయంలో సాత్విక్‌ అనే విద్యార్థి తరగతి గదిలోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే కళాశాలలో పెట్టే ఒత్తిడి వల్లే అతడు చనిపోయినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. అంతేకాకుండా అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్తే.. కనీసం ఆసుపత్రికి కూడా సిబ్బంది తరలించలేదని వివరించారు. దీంతో విద్యార్థులంతా కలిసి ఓ వాహనం లిఫ్టు అడిగి మరీ అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. కానీ ఆసుపత్రికి తరలించే లోపే సాత్విక్ చనిపోయాడని వివరించారు.  


మానసిక ఒత్తిడికి గురి చేయడం వల్లే సాత్విక్ ఆత్మహత్య


మరోవైపు సాత్విక్ తల్లిదండ్రులు కుమారుడి మృతి గురించి తెలుసుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గతంలో లెక్చరర్లు కొట్టడంతో 15 రోజుల పాటు సాత్విక్ ఆస్పత్రి పాలయ్యాడని వివరించారు. లెక్చరర్లందరికీ తమ కుమారుడిని ఏం అనొద్దని చెప్పి మళ్లీ హాస్టల్ లో చేర్పించినట్లు ఏడుస్తూ తెలిపారు. మానసికి ఒత్తిడికి గురి చేయడం వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని.. కళాశాల యాజమాన్యమే విద్యార్థి మృతికి కారణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే శ్రీచైతన్య కాలేజీ ముందు ఆందోళనకు దిగిన క్రమంలో సాత్విక్ తల్లి కళ్లు తిరిగి పడిపోయారు. సాత్విక్ మృతికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడిస్తామని పోలీసులు సాత్విక్ తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.