హైదరాబాద్ (Hyderabad) శివారు ప్రాంతంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగుడాలో కాల్పుల ఘటన జరిగింది. కర్ణంగుడా గ్రామ సమీపంలో ఇద్దరు వ్యాపారుల రియల్ ఎస్టేట్ వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో కాల్పులు (Gun Fire in Hyderabad) జరిపారు. ఈ కాల్పులతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి (Gun Fire on Realtor) మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయాలపాలు అయ్యారు. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనంపై కూడా రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. అయితే, తనపై తుపాకీతో కాల్చిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని రియల్టర్ తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.


రఘవేందర్ అనే వ్యక్తి ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులకు కారణం వ్యాపార లావాదేవీలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి శ్రీనివాస్‌ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. సెటిల్‌మెంట్‌కు పిలిచి కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు.


ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం ఏసీపీ వివరాలను వెల్లడించారు. తొలుత కారులో ముగ్గురు వ్యక్తులు బయలుదేరారని, ఆ తర్వాత మూడో వ్యక్తి.. రఘు, శ్రీనివాస్‌లపై కాల్పులు జరిపారని తెలిపారు. ఆ మూడో వ్యక్తి వారిద్దరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తే అని వివరించారు.


నేడు ఉదయం (మార్చి 1) కర్ణంగూడకు వెళ్లే మార్గంలో ఓ వాహనం రోడ్డు నుంచి దిగిపోయి ఉండడాన్ని స్థానికులు గమనించారు. అందులో ఓ వ్యక్తి పడిపోయి ఉండడంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కారులోని వారిని బీఎన్ రెడ్డి నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి చనిపోగా అతని స్వగ్రామం అల్మాస్ గూడ అని గుర్తించారు. మరో బాధితుడు రఘును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా పోలీసులు చెప్పారు. 


అతనిపైనే అనుమానం
చనిపోయిన, గాయపడిన వ్యక్తులు తెలిపిన వివరాల మేరకు.. పటేల్ గూడ ప్రాంతంలో 22 ఎకరాల్లో శ్రీనివాస్ రెడ్డి, రఘు, మట్టారెడ్డి ఓ వెంచర్ వేశారు. దీని విషయంలో ఈ ముగ్గురి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున 5 గంటలకు శ్రీనివాస్ రెడ్డి, రఘు ఇంటి నుంచి వెళ్లినట్లుగా రఘు భార్య తెలిపారు. వెంచర్ గురించి మాట్లాడదామని మట్టారెడ్డి రమ్మంటేనే వెళ్లారని చెప్పారు. అతనే వీరు ఇద్దరిని తుపాకీతో కాల్చి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.