హైదరాబాద్ నగర శివారులో దారుణం జరిగింది. ఓ యాచకురాలిపై ఐదుగురు యువకులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పరారీలో ఉన్నారు. దుండిగల్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని గండి మైసమ్మ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. స్థానికులు ఈ విషయం గుర్తించడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే ఆమె అక్కడి నుంచి తప్పించుకుంది. తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


దుండిగల్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని గండి మైసమ్మ చౌరస్తాలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన ఓ మహిళ (30) రెండు రోజుల క్రితం నగరానికి వచ్చింది. గండి మైసమ్మ చౌరస్తా ప్రాంతంలో భిక్షాటన చేస్తూ రోడ్డు పక్కనే నిద్ర పోతోంది.



అయితే, శుక్రవారం అర్ధరాత్రి  ఒంటరిగా ఉన్న ఆ మహిళను ఐదుగురు యువకులు గుర్తించారు. ఆమెను యువకులు ఆటోలో ఎక్కించుకున్నారు. సమీపంలో ఉన్న కాలనీ దాటేసి ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ ఖాళీ స్థలం పక్కన ఉన్న ఓ హాస్టల్‌లో యువకులు, చుట్టుపక్కల వారు ఈ ఘటనను గమనించి వెంటనే డయల్ 100కు ఫోన్‌ చేశారు.


దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పెట్రోలింగ్‌ సిబ్బంది ఆ మహిళను కాపాడారు. పోలీసుల రాకను గమనించిన యువకులు పారిపోయేందుకు యత్నించగా ఇమ్రాన్‌ అనే వ్యక్తి దొరికిపోయాడు. అతను తనతోపాటు నరసింహ (23), సాయి (22), కుద్దూస్‌ (21), ఉముృద్దీన్‌ (21) ఉన్నారని విచారణలో ఒప్పుకున్నాడు. వీరంతా అదే ప్రదేశంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. యాచకురాలి కదలికలను కొన్నాళ్లుగా గమనిస్తున్న వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఏపీలోని బాపట్ల జిల్లాలోనూ..
ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లెలోనూ గ్యాంగ్ రేప్ సంచలనం రేపింది. రేపల్లెలో రైల్వే స్టేషన్ లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ప్రకాశం జిల్లా నుంచి కృష్ణ జిల్లా నాగాయలంకకు పనులు నిమిత్తం ఈ మహిళ కుటుంబం వెళ్తోంది. ఈ క్రమంలో గత రాత్రి రైలు దిగి రేపల్లె రైల్వే స్టేషన్‌లోని ఒకటో నెంబరు ప్లాట్ ఫాంపై పడుకున్నారు. నిద్రపోతున్న మహిళను ఫ్లాట్ ఫాం చివరకు లాక్కెళ్లిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలైన మహిళను ఒడిశాకు చెందిన మహిళగా గుర్తించారు.


ఉమ్మడి గుంటూరు జిల్లాలో వారం రోజుల్లో నాలుగో ఘటన ఇది. బాపట్ల జిల్లాలో ఉన్న రేపల్లె రైల్వే స్టేషన్‌లో దుండగులు భర్తను కొట్టి వలస మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారం చేసినట్లుగా బాధితులు చెప్పినట్లుగా పోలీసులు వెల్లడించారు. కూలీ పనుల కోసం వచ్చిన భార్య భర్తలిద్దరూ నిన్న అర్ధరాత్రి సమయంలో రేపల్లే రైల్వే స్టేషన్‌లో రైలు దిగారు. ఆ సమయంలో అవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో స్టేషన్‌లోనే ప్లాట్ ఫాంపైన ఉన్న బెంచీలపైన పడుకున్నారు. 


ఇదే సమయంలో ముగ్గురు వ్యక్తులు నిద్రిస్తున్న మహిళను పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. వారికి అడ్డుపడ్డ భర్తపై ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. నిందితులను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బాధిత దంపతులు నుంచి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.