శ్రీకాకుళం ఈనెల ఆరో తేదీన జరగాల్సిన పబ్లిక్ హియిరింగ్ వద్దే వద్దంటున్న భావనపాడు పోర్టు నిర్వాసితులు. ప్యాకేజీతో పాటు అన్ని విధాలుగా ఆదుకుంటామంటేనే గ్రామాల్లోకి అడుగు పెట్టాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. 


చట్టం పరిధిలో చేయాల్సిన సాయం చేస్తామని.. వీలైనంత వరకు ఆదుకుంటామని మంత్రి అప్పలరాజు,  కలెక్టర్ శ్రీకేష్ ఎంత చెప్పినా ప్రజలు వినిపించుకోవడం లేదు. భావనపాడు పోర్టుకు సహకరించాలన్న విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదు. 


భావనపాడు పోర్టు భూసేకరణపై రైతులు, ప్రజలు, అధికారులతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశం  వాగ్వాదాలతో ముగిసింది. ఈ భేటీకి మంత్రి అప్పలరాజు, కలెక్టర్ శ్రీకేష్ లాఠకార్, జేసీ ఎం. సునీత, మూలపేట, రాజపురం, విష్ణుచక్రపురం గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. 


భావనపాడు నుంచి మూలపేట వైపునకు పోర్ట్ నిర్మాణ ప్రాంతం మార్చడంతో గత కొన్ని రోజులుగా ఆప్రాంతంలో అధికారులు సర్వే చేస్తున్నారు. భూసేకరణపై వచ్చెనేల ఆరో తేదిన పబ్లిక్ హియిరింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముందస్తుగా కలెక్టర్‌ ఆ ప్రాంత ప్రజలతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై సమీక్షించారు.


పోర్టు నిర్మాణానికి ప్రజలు సహకరించాలని మంత్రి అప్పలరాజు కోరారు. ప్రస్తుతం నిర్ణయించే పరిహారంపై వారంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వం కోల్పోతున్నామని అటువంటి సమయంలో మంత్రి, కలెక్టర్ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కొందరు వేడుకున్నారు. ఆ ప్రాంతంలో భూముల విలువ కోట్లలో ఉంటే రికార్డుల మేరకు ఎకరాకు రూ.15 లక్షలు చెల్లిస్తామంటే ఎలా అంగీకరిస్తామని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై మరికొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు.


అన్యాయంగా భూమి లాక్కోవాలని చూస్తున్నారంటూ నిర్వాసిత రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తామంటున్న ప్యాకేజి ఏ మూలకు సరిపోదని ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ రేటు ప్రకారం భూములకు పరిహారం ఇవ్వాలన్నారు. ఆర్ఆర్ ప్యాకేజ్‌తోపాటు ఉద్యోగాలు కల్పించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. 


ఒకానొక దశలో కొందరు నిర్వాసితులు సమావేశాన్ని బహిష్కరించేందుకు నిర్ణయించారు. కలెక్టర్ జోక్యంతో వారు తిరిగి సమావేశంలో కూర్చున్నారు. చట్టప్రకారం నిర్వాసితులను ఆదుకుంటామని కలెక్టర్ తెలిపారు. గ్రామంలో రైతుకు ఉన్న 50 సెంట్ల విస్తీర్ణం తీసుకుని ఎంతో కొంత పరిహారం ముట్టజెబితే భవిష్యతో ఏలా బతుకుతామని ప్రశ్నించారు నిర్వాసితులు. 


మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. వంశధార నీరు నందిగాంకు వస్తుందంటే ఎంతో మంది భూములు త్యాగం చేయడం వల్ల అది సాధ్యమైందన్నారు. పెద్ద ప్రాజెక్టుల సమయంలో అందరి సహకారం అవసరమన్నారు. కొందరు పోర్టు కాంట్రాక్టు ప్రస్తావన తీసుకురావడంతో మూలపేట పోర్టు ప్రైవేటుది కాదని ప్రభుత్వమే నిర్మిస్తుందని మంత్రి వారిని సముదాయించారు.


భూములు కోల్పోయే బాధితులకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచనని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. రైతులతో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సహృదంతో రైతులు పోర్టుకు సహకరిస్తున్నారని చెప్పారు. భూసేకరణ పరిహారం పెంచాలని నిర్వాసితులు కోరుతున్నారని పరిశీలనలో ఉందని తెలిపారు. 


భావనపాడు బిదేవునలాడ మధ్యలో నిర్మించాలనుకున్న పోర్టుకు, ఆర్ఆర్ ప్యాకేజ్ వ్యయం చాలా ఎక్కువ అవుతోందని ఆ ప్రాంతం నుంచి మూలపేట వద్దకు మార్చామన్నారు మంత్రి. దీనికి డీపీఆర్ సిద్ధం చేశామని పర్యావరణ అనుమతుల కోసం పంపించామని మంత్రి పేర్కొన్నా రు. జిల్లాలో చేపట్టనున్న భావనపాడు పోర్టు నిర్మాణానికి ఆయా గ్రామ ప్రజలు సహకరించాలని, పోర్టు నిర్మాణంతో జిల్లా దశాదిశ మారనుందని పేర్కొన్నారు. భావనపాడు పోర్టు నిర్మాణానికి తొమ్మిది గ్రామాల్లో భూమి సేకరించాల్సి ఉందన్నారు. 


పోర్టు నిర్మాణా నికి 675.6 ఎకరాలు కావాల్సి ఉండగా, 241.89 ఎకరాలు ప్రభుత్వ భూములు కాగా, 433.7 ఎకరాలు ప్రైవేట్ భూములుగా గుర్తించామన్నారు మంత్రి. ఇందులో మూలపేట, రాజపురం, విష్ణుచక్రపురం తదితర గ్రామాలు ఉన్నాయని తెలిపారు. మరో 10, 15 రోజులలో శంకుస్థాపన చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పీడీఎఫ్ చేరుస్తామని చెప్పారు. అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు. పీడీఎఫ్ ప్యాకేజీని అమలుచేస్తామన్నారు. ప్రభుత్వం విద్యుత్, కాలువలు, రోడ్లతో అభివృద్ధి చేసి ఒక్కొక్కరికి 5 సెంట్ల భూమి ఇవ్వనుందని కూడా తెలిపారు.