Fingerprint Surgery Case: కాదేదీ కవిత కనర్హం అన్నారు ఓ మహాకవి. అయితే దాని అర్థాన్ని మార్చేస్తూ కాదేదీ మోసానికి అనర్హం అని మార్చేస్తున్నారు నేటి కేటుగాళ్లు. అడ్డదారిలో డబ్బు సంపాదించడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు. చదువుకుని సంపాదించుకున్న జ్ఞానాన్ని మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ సర్జరీలు చేసి అక్రమంగా కువైట్ వెళ్లేందుకు సహకరిస్తున్న ముఠా బాగోతం బయటకు వచ్చింది. ఈ కేసులో రాచకొండ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 


దేశంలోనే తొలిసారిగా ఫింగర్ ప్రింట్ సర్జరీలు చేస్తున్న ముఠాను హైదరాబాద్ రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫింగర్ ప్రింట్స్ ను మార్చేసి, నకిలీ ప్రింట్స్ ను సృష్టించి, నేరచరిత్ర ఉన్నవారిని ఉద్యోగాల కోసం విదేశాలకు పంపుతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సర్జరీకి అవసరమైన కిట్ ను స్వాధీనం చేసుకున్నారు. 


ఇద్దరు స్నేహితులు కలిసి


కడప జిల్లా సిద్ధవటం మండలం జ్యోతి గ్రామానికి చెందిన గజ్జల కొండు గారి నాగమునీశ్వర్ రెడ్డి, బోవిల్ల శివశంకర రెడ్డి, సుండుపల్లికి చెందిన సాగబాల వెంకటరమణ, అట్లూరికి చెందిన రెండ్ల రామకృష్ణారెడ్డి స్నేహితులు. మునీశ్వర్ రెడ్డి 2000లో తిరుపతిలో రేడియాలజికల్ ఎనలిస్ట్ సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేశాడు. అనంతరం తిరుపతిలోనే ఒక డయాగ్నస్టిక్ సెంటర్ లో రేడియోగ్రాఫర్ టెక్నీషియన్ గా పనిచేశాడు. అక్కడే అతని స్నేహితుడు వెంకట రమణ అనస్తీషియా టెక్నీషియన్ గా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. మునీశ్వర రెడ్డి ఫ్రెండ్ ఒకరు వీసా గడువు ముగియటంతో భారత్ కు వచ్చేశాడు. ఆ తర్వాత అతను తన వేళ్లకు సర్జరీ చేయించుకుని నకిలీ ప్రింట్స్ ను సృష్టించుకుని మళ్లీ కువైట్ వెళ్లాడు. ఈ విషయం స్నేహితుల మధ్య చర్చకు వచ్చింది. అందులో నుంచే ఒక మోసపూరిత ఆలోచన పుట్టుకొచ్చింది. 


అదే పెట్టుబడిగా


మునీశ్వర రెడ్డికి సర్జరీలపై, వెంకటరమణకు అనస్తీషియాపై మంచి పట్టు ఉంది. అదే పెట్టుబడిగా మోసాలకు తెరతీశారు. నేర చరిత్ర కలిగి, వీసాలు రిజక్టయి, విదేశాలకు వెళ్లలేకపోతున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఫింగర్ ప్రింట్స్ మారుస్తున్నారు. కువైట్ లో ఉన్న తమ స్నేహితుడి సహకారంతో అలాంటి వారి వివరాలు సేకరించారు. వారి వేళ్లకు సర్జరీ చేసి వేలిముద్రలు మారేలా చేసేవారు. ఒక్కో సర్జరీకి రూ. 25 వేలు వసూలు చేసేవారు. 


సర్జరీ ఇలా..


ముందుగా సర్జరీ చేయడానికి అవసరమైన కిట్ ను సిద్ధం చేసుకుంటారు. కస్టమర్స్ చెప్పిన అడ్రస్ కానీ.. వీరు నిర్ణయించుకున్న చిరునామాకు కానీ వెళ్తారు. ముందుగా చేతివేళ్లకు అనస్తీషియా ఇస్తారు. వేళ్ల పైన ఉన్న లేయర్ ను తొలగిస్తారు. అనంతరం ఫింగర్ టిప్స్ ను కట్ చేసి లోపల అతిచిన్న పరిమాణంలో కణజాలాన్ని బయటకు తీసి వేళ్లకు కుట్లు వేస్తారు. రెండు నెలల్లోగా గాయం పూర్తిగా మాని కొత్త లేయర్ వస్తుంది. కట్ చేసి కుట్లు వేయడం వలన కొత్త వేలిముద్రలకు, పాత వేలిముద్రలకు కొద్దిపాటి తేడా ఉంటుంది. ఆ తర్వాత సర్జరీ చేయించుకున్న వారు ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకుంటారు. అది అప్ డేట్ అవ్వగానే పాస్ పోర్టు పోయిందని కంప్లైంట్ ఇస్తారు. అప్ డేట్ అయిన కొత్త ఆధార్ కార్డుతో మరో పాస్ పోర్టు తీసుకుంటారు. ఆ తర్వాత వీసాకు అప్లై చేస్తారు. కొత్తగా వచ్చిన వేలిముద్రలు కాబట్టి వారి నేరచరిత్ర బయటపడదు. దాంతో వీసా వచ్చిన వెంటనే ఉద్యోగాల కోసం కువైట్ వెళ్లిపోతున్నారని పోలీసుల విచారణలో తేలింది. 


మళ్లీ అదే తంతు


కువైట్ వెళ్లాక వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటే ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకుంటారు. వారి వేలిముద్రలు మరే ఇతర వాటితో మ్యాచ్ కాకపోవటంతో కొన్ని రోజులు జైల్లో ఉంచి వారే టికెట్ కొని ఇండియాకు పంపిస్తారు. భారత్ కు తిరిగివచ్చిన వారు మళ్లీ సర్జరీ చేయించుకుని కొత్త ఫింగర్ ప్రింట్స్ రాగానే ఇదే విధంగా కువైట్ కు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. 


ఇప్పటివరకు వీరు తమ సొంత గ్రామంలో ఇద్దరికి, రాజస్థాన్ లో ఇద్దరికి, కేరళలో ఆరుగురికి, కడప జిల్లాలో ఇద్దరికీ ఈ విధమైన సర్జరీ చేశారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు నకిలీ ఫింగర్ ప్రింట్స్ తో కువైట్ కు వెళ్లినట్లు పోలీసుల విచారలో తేలింది. 


ఇటీవల కాలంలో ఇలాంటి ఘరానా మోసాలు ఎక్కువయ్యాయి


నిన్న హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ నోట్ల ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలోని పుణెకు చెందిన కస్తూరి రమేష్ బాబు(35) అనే వ్యక్తి.. జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి ఆటోమొబైల్ దుకాణాన్ని నడుపుతున్నాడు. ఇతని సంపాదన ఖర్చులకు సరిపోక.. సులభ పద్ధతిలో డబ్బు సంపాదించాలనుకున్నాడు. యూట్యూబ్ వీడియోలు చూసి తన సోదరితో కలిసి దొంగ నోట్లు ముద్రించడం ప్రారంభించాడు. ఆ డబ్బులను అవసరమున్న వారికి ఇవ్వడం మొదలుపెట్టాడు. 


కస్టమర్లను ఆకర్షించడానికి యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేశాడు. అది చూసిన అంజయ్య అనే సెక్యురిటీ గార్డు రమేష్ ను సంప్రదించాడు. రూ. 50 వేల ఒరిజినల్ కరెన్సీకి బదులు లక్షా 30 వేల విలువైన నకిలీ నోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అనుకున్నట్లుగానే రమేష్ బాబు అంజయ్యకు ఆ నకిలీ నోట్లు ఇచ్చాడు. 


అంజయ్య ఆ నకిలీ డబ్బులో అరటి పండ్లు కొనగా.. ఆ వ్యాపారి అవి దొంగ నోట్లని పసిగట్టాడు. వెంటనే గోపాలపురం పోలీసులకు అప్పగించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. అంజయ్య ఇచ్చిన సమాచారంతో రమేష్ బాబును అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి రూ. 3 లక్షల 16 వేల విలువైన నకిలీ నోట్లను, ప్రింటింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు.