Youth commits Suicide in Hyderabad:
హైదరాబాద్‌: నగరంలో మరో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల కిందట ప్రవళిక అనే గ్రూప్ - 2 అభ్యర్థిని ఆత్మహత్య చేసుకున్న విషాదాన్ని మరువకముందే హైదరాబాద్ లో ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ లోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది.


అసలేం జరిగిందంటే..
జగిత్యాల జిల్లా మల్యాల మండలం పోతారానికి చెందిన సాయిరాం అనే యువకుడు బీటెక్‌ పూర్తి చేశాడు. నగరంలోని హిమాయత్‌ నగర్‌లోని వెలమ హాస్టల్‌లో సాయిరాం ఉంటున్నాడు. హాస్టల్ లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ హాస్టల్‌లోనే పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. హాస్టల్ లో తోటివాళ్లు గమనించే సరికే సాయిరాం ప్రాణాలు విడిచాడని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ కు చేరుకుని పరిశీలించారు, యువకుడు సాయిరాం ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలపై హాస్టల్ లో ఉన్నవారిని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల కిందట ప్రవళిక అనే యువతి ఆత్మహత్యతో జంట నగరాలలో కొన్ని చోట్ల ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మరో యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.