Seizure of Marijuana in Medchal District : నిత్యం ఎక్కడో ఒక చోట తరచూ గంజాయి పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి రోడ్డు, రైలు మార్గాల ద్వారా సరఫరా అవుతున్నాయి. ఎక్సైజ్‌, పోలీసు అధికారులు కిలోల కొద్దీ గంజాయిని పట్టుకుంటున్నా గంజాయిని సరఫరా ఆగడం లేదు. మరోవైపు గ్రామీణ యువత, విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. అనారోగ్యానికి గురవుతామని తెలిసి కూడా గంజాయిని వదలడం లేదు.  తాజాగా దుండిగల్  పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో గంజాయి తరలిస్తున్న ముఠా ను రాజేంద్ర నగర్ ఎస్ ఓ టీ, దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా నుండి ఢిల్లీకి వయా హైదారాబాద్ మీదుగా హోండా సిటీ కార్ లో తరలిస్తున్నారన్న సమాచారం తో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 86కేజీల గంజాయి తో పాటు ఒక కారు, 2సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  


ముగ్గురు నిందితులు పరార్
ఐదుగురు నిందితుల్లో ట్రాన్స్ పోర్టు చేస్తున్న  ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారుజ అరెస్ట్ అయిన వారిలో ఒడిశాకు చెందిన సునీంద్ర కుమార్ సింగ్  పాత నేరస్తుడు కాగా  లక్ష్మి అనే మహిళ కూడా ముఠాలో ఉంది. కారుతో పాటు పట్టుకున్న గంజాయి విలువ సుమారు 33లక్షలు ఉంటుందని తెలిపారు. పెట్ బషీరాబాద్ లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రాజేంద్ర నగర్ ఎస్ ఓ టీ, దుండిగల్ పోలీసులు ముఠాను పట్టుకున్నారు.


భద్రాచలంలో 45కేజీల గంజాయి స్వాధీనం
రాజస్థాన్‌కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం కూనవరం రోడ్డులోని ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఒడిశా నుంచి రాజస్థాన్‌కు కారులో 45.170 కిలోల గంజాయిని తరలిస్తుండగా ముఖేష్ మిర్దా, గుజ్జర్ శ్రీరామ అనే వ్యక్తులు పట్టుబడ్డారు. రెండు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.  


దేవరపల్లిలో 64కిలోల గంజాయి స్వాధీనం
దేవరపల్లి మండలం రైవాడ పంచాయతీ శివారు శ్రీరాంపురం గ్రామంలో గురువారం రాత్రి పోలీసుల దాడిలో 64 కిలోల గంజాయి పట్టుబడినట్లు ఎస్సై టి.మల్లేశ్వరరావు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం సాయంత్రం శ్రీరాంపురం జంక్షన్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. కారులో ఐదుగురు యువకులు కనిపించారు. కారులో గంజాయి లభ్యమైంది. దాడి సమయంలో ఇద్దరు తప్పించుకోగా, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న కారులో 32 గంజాయి ప్యాకింగ్‌లు ఉన్నాయని, ఒక్కో ప్యాకెట్‌ రెండు కేజీలు ఉన్నాయని తెలిపారు. మొత్తం 64 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, ఒడిశా రాష్ట్రం జామిగూడ గ్రామం నుంచి తీసుకువస్తున్నామని నిందితులు తెలిపారు. అరెస్టయిన నిందితులు రంజు వీర (28), అర్జున్(30) అనే ఇద్దరు వ్యక్తులు మల్కన్‌గిరి జిల్లా జమ్మిగూడ మండలం పనసపుట్టు గ్రామానికి చెందినవారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి చోడవరం కోర్టుకు తరలించినట్లు ఎస్సై మల్లేశ్వరరావు విలేకరులకు తెలిపారు.


 


Read Also : Kuppam News: కుప్పంలో గంజాయి కలకలం! కర్రలు, రాడ్లతో కొట్టుకున్న యువకులు!  


Read Also : Ganja Seize: 'పుష్ప' సినిమానే మించిపోయారు - ఏకంగా అంబులెన్సులోనే గంజాయి తరలింపు