మేడ్చల్: బర్త్ డే పార్టీలో అనుకోకుండా స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఏకంగా హత్యకు దారి తీసింది. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లాలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దీనబంధు నగర్ లో నివాసముండే నదీమ్ (24) బ్యాండ్ వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మద్యం సేవించిన స్నేహితుల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు వారిని వారించి అక్కడి నుంచి పంపించివేశారు. అనంతరం మద్యం మత్తులో ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి గొడవపడ్డారు. ఈ క్రమంలో స్నేహితులు ఓ రాడ్డుతో తలపై కొట్టి నదీమ్ ను హత్య చేసినట్లుగా సమాచారం. ఆదివారం తెల్లవారుజాము సుమారు 3 గంటల ప్రాంతంలో నదీమ్ హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే జగద్గిరిగుట్ట పోలీసులు నదీమ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Also Read: Telangana Caste Census: తెలంగాణలో రెండోసారి సమగ్ర కుటుంబ సర్వే, రేవంత్ రెడ్డి మార్క్ నిర్ణయాలు ఉంటాయా?