Hyderabad Crime News: ప్రేమ మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమ కుమార్తెను ప్రేమించాడన్న కోపంతో బాలిక కుటుంబ సభ్యులు ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా కొట్టి హత్య చేశారు. బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌ శివారు మేడ్చల్‌ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. ఘట్‌కేసర్‌ సమీపంలోని అన్నోజిగూడ శ్రీలక్ష్మీనరసింహ కాలనీకి చెందిన కరణ్‌ నాయక్‌(18) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తల్లి యాదిబాయ్‌తో కలిసి స్థానికంగా నివాసముంటున్నాడు. 


కరణ్‌ నాయక్ అదే కాలనీకి చెందిన బాలిక(15)ను కొద్ది కాలంగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు కరణ్‌ను చాలా సార్లు మందలించారు. అయినా అవేమీ పట్టించుకోని కరణ్ బాలికను కలిసేందుకు వెళ్లేవాడు. ఎన్ని సార్లు మందలించినా ఈ తంతు కొనసాగుతూ వచ్చింది. బుధవారం బాలిక తల్లిదండ్రులు స్థానికంగా శుభకార్యానికి వెళ్లారు. ఆ సమయంలో బాలిక ఇంట్లో ఉండడంతో ఆమెను కలిసేందుకు కరణ్ అర్ధరాత్రి నేరుగా ఇంటికెళ్లాడు. 


స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు వెంటనే ఇంటికి వచ్చేశారు. కరణ్‌ తప్పించుకోకుండా ముందుగా బయట నుంచి గడియపెట్టారు. బంధువులను పిలిపించుకుని ఇంట్లోకి ప్రవేశించారు. కరణ్‌ను విచక్షణా రహితంగా కొట్టారు. దుస్తులు విప్పి నగ్నంగా చేసి తాళ్లతో కట్టేశారు. అతడి ప్రైవేటు భాగాలపై కారం చల్లుతూ కర్రలతో కొట్టారు. కొద్ది సేపటికి యువకుడు అపస్మారక స్థితికి వెళ్లి మరణించాడు. ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 


ఇన్‌ఛార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ నాగార్జున్‌రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు.  బాలిక తల్లిదండ్రులు సహా 9 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు  తరలించారు. స్థానికంగా అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఘటన స్థానికంగా సంచలనం రేపింది.


ప్రేమ పెళ్లి చేసుకుంటానన్నందుకు కూతురిని చంపిన తల్లి
అనంతపురం జిల్లాలో రెండు రోజుల క్రితం దారుణం జరిగింది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన కూతురిని ఓ తల్లి.. కొడుకు సాయంతో హతమార్చింది. వివరాలు.. గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన బాలిక(17) ఓ యువకుడిని ప్రేమించింది. అయితే కోమలకు ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కోమల తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పింది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానని తెలిపింది. 


బాలిక ప్రేమను ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే తాము పెళ్లి సంబంధం చూసిన వారికి ఏం చెప్పాలంటూ ప్రశ్నించారు. దీంతో వారి మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన తల్లి, సోదరుడు బాలికను చితకబాదారు. గొంతుకు చున్నీ బిగించి హతమార్చారు. తరువాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మ‌ృతదేహాన్న పోస్టుమార్టానికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


హైదరాబాద్‌లో యువకుడి హత్య
హైదరాబాద్‌లో పరువు హత్య జరిగింది. అంబర్‌పేట్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని, అమ్మాయి మేనమామ క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడు. వివరాలు.. బాపునగర్‌కు చెందిన మౌనిక అనే అమ్మాయి శ్రీనివాస్ రాజును గత కొద్ది రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇది అమ్మాయి మేనమామ పుష్ప రాజ్‌కు నచ్చలేదు. శ్రీనివాస్ రాజు‌పై కోపం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి బ్యాట్‌తో చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.