Hawala Amount Seized: హైద‌రాబాద్‌లో మరోసారి భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. మొన్న ఆదివారం రోజే రూ. 2.5 కోట్ల నగదు పట్టుబడగా.. ఈరోజు రూ. 3.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ పీఎస్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న డబ్బును ట్యాంక్ బండ్ హోటల్ మారియట్ వద్ద నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. గండి సాయికుమార్ రెడ్డికి వెంక‌టేశ్వ‌ర్ అనే వ్య‌క్తి రూ. 3.5 కోట్ల న‌గదు ఇచ్చాడు. ఆ న‌గ‌దును సైదాబాద్‌లో ఉండే బాలు, మ‌హేంద‌ర్‌కు ఇవ్వాల‌ని సూచించాడు. ఇదే స‌మ‌యంలో పోలీసులు అక్క‌డికి చేరుకుని త‌నిఖీలు నిర్వ‌హించారు. 


3.5 కోట్ల రూపాయల న‌గ‌దుతో పాటు 7 సెల్‌ఫోన్లు, రెండు కార్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గండి సాయికుమార్ రెడ్డి, గుండే మ‌హేశ్‌, సందీప్ కుమార్, మ‌హేంద‌ర్, అనూష్ రెడ్డి, భ‌ర‌త్‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగదు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఎవరు ఇచ్చారు వంటి పూర్తి సమాచారం తెలపకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 


ఆదివారం రోజు 2.5 కోట్ల డబ్బు పట్టివేత...


జూబ్లీహిల్స్, భారతీయ విద్యాభవన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై భారీ ట్రావెలర్స్ బ్యాగ్‌తో నగదును ఇద్దరు వ్యక్తులు తరలిస్తున్నారు. అనుమానం వచ్చి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేయగా ఆ బ్యాగులో రూ. 2,49,79,000 (2 కోట్ల 49 లక్షల 79 వేల రూపాయలు) ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన రిసీప్ట్, పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నించగా నిందితులు అవేమీ లేవని సమాధానమిచ్చారు. దీంతో టాస్క్ ఫోర్స్ ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.


బేగంబజార్ వ్యాపారి హవాలా దందా


గుజరాత్ కు చెందిన లలిత్ హవాలా దందా నిర్వహిస్తున్నాడు. బేగంబజార్ లో నివసించే లలిత్ ఇటీవల బీజేపీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా రాజం మండలానికి చెందిన బచ్చు రాము కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతడు బోయాన్షి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఢిల్లీలోని తన కొలీగ్ సత్యనారాయణ అనే వ్యక్తి చెప్పినట్టుగా రాము శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.76లో ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఆ నగదును తీసుకొన్నాడు. రూ.2.5 కోట్ల నగదును బేగంబజార్ లో ఉండే లలిత్ కు చేరవేయాల్సి ఉంది. 


రాము వద్ద ఉన్న నగదును తన వద్దకు తీసుకురావాలని బీజేపీ నేత లలిత్ రాజస్థాన్‌కు చెందిన అశోక్‌ సింగ్‌, గుజరాత్‌కు చెందిన ఈశ్వర్‌లాల్‌ పటేల్‌ ను పురమాయించాడు. వీరిద్దరూ నగదు తీసుకోస్తుండగా జూబ్లీహిల్స్, భారతీయ విద్యాభవన్ సమీపంలో పక్కా సమాచారంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగదు ఇచ్చిన రాముతో పాటు తీసుకురావడానికి వచ్చిన ఈశ్వర్‌లాల్‌ పటేల్‌, అశోక్‌ సింగ్‌ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నగదు పంపించిన ఢిల్లీ వ్యక్తి సత్యనారాయణ, వ్యాపారి లలిత్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో భారీగా హవాలా డబ్బు పట్టుబడుతుండటంతో ఎన్నికలకు సంబంధిచిన కోణంలోనూ విచారణ చేపట్టే అవకాశం ఉంది.