Guntur Crime : ఏపీలో ఆడపిల్లలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడడంలేదు. తాజాగా గుంటూరు జిల్లా నల్లపాడు స్టేషన్ పరిధిలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. తెలిసిన వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదని నమ్మించి బాలికను ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు యువకుడు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ లాడ్జిలో బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. తొమ్మిదో తరగతి విద్యార్థిని అత్యాచారానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జనసేన నాయకులు జీజీహెచ్‌కు చేరుకొని ఆందోళన చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని నిరసన వ్యక్తంచేశారు. వరుస ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. 


"రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేదు. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలి. మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో రోజూ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. జనసేన తరఫున బాధితుల న్యాయం జరిగే వరకూ పోరాడతాం. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. " జనసేన మహిళా నాయకులు    


బాలికపై అఘాయిత్యం 


తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన ఆరేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బుధవారం సాయంత్రం ముగ్గురు చిన్నారులు లేఅవుట్‌ పరిధిలో ఆడుకుంటుండగా అక్కడ సెక్యూరిటీగా ఉన్న వ్యక్తి (56) ఓ బాలికను గది లోపలకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆ బాలికను ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


బాలికపై వృద్ధుడి అత్యాచారం 


చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని ఓ గ్రామంలో 8 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వ్ధృద్ధుడు బుధవారం అత్యాచారం చేశాడు. ఎస్ఐ ప్రసాద్‌ వివరాల ప్రకారం ఉమాపతి (70) అదే గ్రామానికే చెందిన బాలిక ఆడుకుంటుండగా నిర్మాణంలో ఉన్న సచివాలయంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆ బాలికను వైద్య పరీక్షల కోసం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.