Guntur Crime News: వైసీపీ ఎమ్మెల్యే సభ కోసం.. తమకు చెప్పకుండా జనాల్ని తీసుకెళ్లడం ఏంటంటూ వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడో కానిస్టేబుల్. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 


అసలేం జరిగిందంటే..?


బాపట్ల జిల్లా‌ పిట్టలవానిపాలెం సంగుపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. బాపట్ల ఎంఎల్ఏ కోనా రఘుపతి నిర్వహించిన జగనన్న రుణమాఫీ కార్యక్రమానికి... డ్వాక్రా సంఘాల మహిళలను తీసుకు వెళ్లింది సంగుపాలెం గ్రామ డ్వాక్రా యామినేటర్  జీవకుమారి. అయితే పెద్ద సంఖ్యలో డ్వాక్రా హిళలను యామినేటర్ తరలించడంతో గ్రామ సర్పంచ్, ఆయన కుమారుడు.. జీవ కుమారిని టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే తమ అనుమతి లేకుండా ఎందుకు తీసుకెళ్తున్నావంటూ సర్పంచ్ జీవకుమారితో వాగ్వాదానికి దిగారు. గొడవ ఎందుకంటూ అడ్డుగా వచ్చిన యానిమేటర్ భర్త శ్రీనివాసరావు పై దాడి చేశారు. విషయం గుర్తించి వచ్చిన స్థానికులు నచ్చజెప్పగా ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఈ  ఘటన గురించి తెలుసుకున్న సర్పంచ్ కుమారుడు మహేష్... బజారుకు వెళ్లి వస్తున్న శ్రీనివాసరావుపై బ్లేడుతో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో శ్రీనివాసరావు కుడి చెవి తెగిపోయింది. అయితే విషయం గుర్తించిన స్థానికులు ఇద్దరినీ ఆపారు. 


అనంతరం శ్రీనివాస రావును పొన్నూరు గవర్నమెంట్  ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించి.. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. . బ్లేడుతో దాడి చేసిన సర్పంచ్ కుమారుడు మహేష్ పొన్నూరులో  పోలీస్‌ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. తమకు తన కుటుంబ సబ్యులకు సర్పంచ్, అతని కుమారుడు నుంచి ప్రాణహాని ఉందని శ్రీనివాస రావు భార్య జీవకుమారి చెబుతోంది. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని కోరుతుంది. అలాగే నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.


 గంజాయి మత్తులో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్


విజయవాడలో 20 రోజుల క్రితం గంజాయి మత్తులో బ్లేడ్ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లేడ్ బ్యాచ్ లోని రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ సాగింది. గంజాయి మత్తులో నడిరోడ్డుపై పరస్పరం దాడులకు తెగబడడంతో జనం భయంతో హడలిపోయారు. ఈ దాడిలో అఖిల్ శ్రీను అనే యువకుడు గాయపడ్డాడు. పోలీసులు గంజాయి బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. 


అసలేం జరిగింది? 


గురువారం రాత్రి గని అనే బ్లేడ్‌ బ్యాచ్‌ సభ్యుడికి, ఆంజనేయ వాగు సమీపంలో ఉండే సాంబా అనే యువకుడికి మధ్య గొడవ తలెత్తింది. మద్యం మత్తులో ఉండి వీరంగం వేస్తున్న గని బ్యాచ్‌ సభ్యుడిని పట్టుకొని హరి బ్యాచ్‌ పోలీసులకు అప్పగించింది. పోలీసులకు అప్పగించారనే కక్షతో హరి బ్యాచ్‌ పై గని బ్యాచ్‌ దాడికి పాల్పడింది.  ఆంజనేయ వాగు సెంటర్‌ కొండ ప్రాంతంలో గని బ్యాచ్‌ సభ్యుడైన అఖిల్‌, మరో ఆరుగురు యువకులతో కలిసి శుక్రవారం అక్కడికి చేరుకుని బ్లేడ్లతో దాడికి పాల్పడ్డారు.  ఈ దాడిలో అఖిల్‌, శ్రీను అనే ఇద్దరు యువకులకు తీవ్రగాయలయ్యాయి. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా గ్యాంగ్‌ వార్‌ జరగడంతో స్థానికులు భయాందోళన చెందారు.