Guntur Beggar Murder : గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం డొంకరోడ్డులో యాచకుడి హత్య కేసును పోలీసుల ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిందితులు హత్య చేయడానికి చేసిన కారణం విని షాకయ్యారు. తాము ఇచ్చిన ఇడ్లీ తీసుకోనందుకే యాచకుడిని దారుణంగా హత్య చేశామని నిందితులు ఒప్పుకున్నారు. మిర్చియార్డులో ముఠాకూలీగా పనిచేస్తున్న నల్లపాడుకు చెందిన దగ్గు మహేష్‌బాబు, నిమ్మా అనిల్‌, ప్రత్తిపాటి సతీష్‌కుమార్‌లు బిచ్చగాడిని హత్య చేసినట్టు నల్లపాడు పోలీసులు గుర్తించారు. 


దివ్యాంగుడైన యాచకుడి హత్య 


ఈ కేసు వివరాలను డీఎస్పీ ప్రశాంతి మీడియాకు తెలిపారు. దివ్యాంగుడైన యాచకుడు హౌసింగ్‌ బోర్డుకాలనీ సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద ఉన్నాడు. ఈ నెల 1వ తేదీ రాత్రి మహేష్‌ యాచకుడికి ఇడ్లీ పార్శిల్‌ను ఇవ్వబోయాడు. మద్యం మత్తులో ఉన్న మహేష్‌బాబు యాచకుడితో చెడ్డీగ్యాంగ్‌ తిరుగుతున్నారు నువ్వు కూడా వారిలాగే వేషం మార్చి వచ్చావా అని గొడవ పడ్డాడు. దీంతో యాచకుడు కోపంతో మహేష్‌ ఇచ్చిన ఇడ్లీని విసిరివేశాడు. ఇడ్లీ విసిరివేశాడన్న కోపంతో మహేష్ అక్కడి నుంచి వెళ్లి తన స్నేహితులైన సతీష్‌, అనిల్‌కు విషయం చెప్పాడు. బిచ్చగాడు తానిచ్చిన ఇడ్లీ తీసుకోలేదని వాడికి ఎంత పొగరు వాడిని చంపేద్దామని మద్యం మత్తులో ముగ్గురు అనుకున్నారు. 


స్థానికంగా సంచలనమైన కేసు  


అర్ధరాత్రి  1.15 నిమిషాలకు పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఉన్న షాప్‌ వద్ద నిద్రపోతున్న యాచకుడని ద్విచక్రవాహనంపై అంకిరెడ్డిపాలెం డొంకరోడ్డులో కొంత దూరం తీసుకెళ్లారు. ఆ తర్వాత రాళ్లు, కర్రలతో అతడిని దారుణంగా కొట్టి హత్య చేసి పొదల్లో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. యాచకుడి హత్య స్థానికంగా సంచలనం అయింది. ఈ హత్యపై జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ అదేశాలతో సౌత్‌ డీఎస్పీ ప్రశాంతి నల్లపాడు సీఐ బత్తుల శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు ఆరోగ్యరాజు, సిద్ధయ్య, కానిస్టేబుళ్లు దర్యాప్తు చేశారు. విచారణలో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. నిందితులు మిర్చియార్డులో ముఠా కూలీలుగా పనిచేస్తున్నారని డీఎస్పీ తెలిపారు. మద్యం మత్తులో అమాయకుడైన బిచ్చగాడ్ని హత్యచేశారని, నిందితులపై రౌడీషీట్‌ ఓపెన్ చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. 


Also Read : Crime News : 36 ఏళ్ల మహిళపై పోక్సో కేసు - ఎంత ఘోరానికి పాల్పడిందంటే ?


Also Read : ఏపీలో ఆ రెండు కార్పొరేషన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు గల్లంతు ? అసలేం జరిగింది ?