Gun firing at a hotel at gajularamaram: గన్ కల్చర్ విజృంభిస్తోంది. రోజూ ఏదో ఒక చోట కాల్పుల ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్ లో కాల్పులు కలకలం సృష్టించాయి.  గాజులరామారంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. మంగళవారం అర్థరాత్రి ఎల్‌ఎన్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద క్యాషియర్‌పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తమ కారులో పెట్రోల్ అయిపోవడంతో.. పక్క కార్ లోని  పెట్రోల్‌ను దొంగిలించేందుకు ముగ్గురు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు క్యాషియర్ అఖిలేష్ ప్రయత్నించారు. దీంతో అతడిని బెదిరించేందుకు నరేష్ అనే వ్యక్తి  తుపాకితో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. 


మూడు రౌండ్ల కాల్పులు
నరేష్ మొత్తం అతడిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. సెక్యూరిటీ సిబ్బంది నరేష్ ను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఈ కాల్పులు జరిగినట్లు సమాచారం.  అయితే కాల్పులు జరిగిన సమాచారాన్ని బార్ యాజమాన్యం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే దుండగులు పరారైనట్లు సమాచారం. కాల్పులు జరిపిన గన్ కు లైసెన్స్ లేదని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


బీజేపీ నేత పై  కాల్పులు
 మరో వైపు పశ్చిమ బెంగాల్‌లోనూ కాల్పులు కలకలం సృష్టించాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భట్‌పరా వద్ద తన కారుపై టీఎంసీ కార్యకర్తలు కాల్పులు జరిపారని బీజేపీ నేత ప్రియాంగు ఆరోపించారు. హత్యాయత్నంలో భాగంగా ఏడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు చేశారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలం నుంచి ఖాళీ బాంబు షెల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.


బంగారం వ‌ర్త‌కుల‌పై కాల్పులు 
ఐదు రోజుల క్రితం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బంగారం వ‌ర్త‌కుల‌పై కాల్పులు జ‌రిపి, వారి వ‌ద్ద నుంచి కొందరు బంగారం దోచుకున్నారు. క‌ళ్ల‌ల్లో కారం చ‌ల్లి, ఇనుప రాడ్డుతో కొట్టారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రికి గాయాలు అయ్యాయి. క‌ల‌క‌త్తాకు చెందిన షేక్ న‌జీర్ పదిహేనేళ్లుగా రాజాంలో బంగారం దుకాణం నడుపుతున్నారు.  తన షాప్‌లో ప‌ని చేసే హుస్సేన్‌తో క‌లిసి న‌గ‌ల‌కు న‌గిషీ ప‌ట్టించేందుకు ద్విచ‌క్ర వాహ‌నంపై బుధ‌వారం రాజాం నుంచి విజ‌య‌న‌గరం వెళ్లారు.  తిరిగి రాత్రి 9.30 గంట‌ల‌కు బైక్ పై వస్తుండగా ఇద్ద‌రు గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు వీరిపై దాడి చేశారు. అప్పటికే త‌మ వ‌ద్ద ఉన్న 50 గ్రాముల బంగారాన్ని రోడ్డు ప‌క్క‌న తుప్ప‌ల్లోకి విసిరేశారు. త‌మ వ‌ద్ద బంగారం లేద‌నే సరికి కోపంతో దుండ‌గులు తుపాకీతో కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో హుస్సేన్ వైపు బుల్లెట్ తగిలింది.  వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, కొంత న‌గ‌దు తీసుకుని దుండ‌గులు ప‌రార‌య్యారు.  పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు.