ఆ పెళ్లిని మృత్యువు వెక్కిరించింది. కలకాలం కలిసి ఉంటామని బాసలు చేసుకున్న కొత్త జంటను కర్కశంగా విడదీసింది. పసుపు కుంకుమలను రక్తంతో తుడిచేసింది. తాళి కట్టి ఒక్క రోజైనా గడవక ముందే వరుడి ప్రాణాలను మింగేసింది. పెళ్లి ఆనందంలో ఉన్న రెండు కుటుంబాలకు నవ్వును దూరం చేసి దు:ఖాన్ని మిగిల్చింది. శుక్రవారం రాత్రి సింహాచలంలో వివాహం చేసుకున్న జమ్మాన పవన్ కుమార్ శనివారం మధ్యాహ్నానికి అరిణాం అక్కివలస వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.


అరిణాం అక్కి వలస వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలం పెద్దకొల్లివలస గ్రామానికి చెందిన జమ్మాన పవన్ కుమార్ మృతి చెందాడు. అతడి మేనమామ బలగ సోమేశ్వరరావు గాయపడ్డారు. పవన్ కుమార్ విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి శుక్రవారం రాత్రి సింహాచలంలో ఇదే మండలం శ్యామలాపురం ఆర్ఆర్ కాలనీకి చెందిన యువతితో వివాహం జరిగింది. 


వివాహం చేసుకున్న వీరు స్వగ్రామంలో వారం రోజులు ఉందామని సింహాచలం నుంచి శనివారం బయల్దేరారు. పెళ్లి జనమంతా బస్సులో రాగా.. పవన్ మాత్రం తన మేనమామతో కలిసి బైక్ పై బయల్దేరాడు. ఎచ్చెర్ల మండలం అరిణాం - అక్కివలస ప్రాంతానికి వచ్చే సరికి వీరి బండిని వెనుక నుంచి వస్తున్న కంటైనర్ ఢీకొంది. దీంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సోమేశ్వరరావుకు గాయాలయ్యాయి. వెనుక వస్తున్న మరో లారీ  డ్రైవర్ 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ లో రిమ్స్ కు తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


రెండు గ్రామాల్లో విషాదం
పవన్ మృతి చెందాడన్న వార్త తెలిసి అతడి స్వగ్రామం పెద్దకొల్లివలస పునరావాస కాలనీలోనూ, వధువు ఊరు శ్యామలాపురం ఆర్ఆర్ కాలనీలోను విషాదం అలముకుంది. ఒక్క రోజులోనే ఎంత ఘోరం జరిగిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.