మిత్రుల మధ్య సెల్‌ఫోన్ చిచ్చుపెట్టింది. చివరకు హత్యకు దారితీసింది. వికారాబాద్‌(Vikarabad) జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


సెల్‌ఫోన్ చిచ్చు


వికారాబాద్ జిల్లా తాండూరు(Tandur) పట్టణంలో జస్వంత్‌, ప్రశాంత్, రాజు ముగ్గురు స్నేహితులు. ప్రశాంత్‌ది తాండూరు, రాజుది మల్‌రెడ్డిపల్లి, జస్వంత్‌ అంతారం గ్రామానికి చెందిన వాడు. ఒకరు రోజు ప్రశాంత్‌ తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ తన ఇద్దరు మిత్రులకు ఇచ్చి డబ్బులు అవసరం ఉందని దాన్ని అమ్మేసి ఇవ్వాలని చెప్పాడు. 


సెల్‌ ఫోన్ షాపు యజమాని ఆగ్రహం


మిత్రుడికి అవసరం ఉందని వెంటనే ఆ సెల్‌ ఫోన్ పట్టుకొని షాప్‌ వద్దకు వెళ్లారు రాజు, జస్వంత్. దాన్ని ఎంతకు అమ్మొచ్చో చెప్పాలన్నారు. దాన్ని పరిశీలించిన షాపు యజమాని వాళ్లపై కోపడ్డాడు. దొంగిలించిన ఫోన్ తీసుకొచ్చి అంటగట్టాలని చూస్తారా అంటు మండిపడ్డాడు.


లేపేయడానికి స్కెచ్


దొంగతనం చేసిన సెల్‌ఫోన్‌ను తమకు అంటగట్టి అవమానించాడని భావించిన రాజు, జస్వంత్ పగ పెంచుకున్నారు. ఎలాగైనా ప్రశాంత్‌కు బుద్ది చెప్పాలని భావించారు. ఇద్దరు ప్లాన్ వేసుకొని ఎలా బుద్ది చెప్పాలో అర్థం కాక లేపేయడానికి నిర్ణయించుకున్నారు.


ఊరి శివారులో హత్య 


ప్రశాంత్‌ను చంపేయడానికి ప్లాన్ చేసిన మిత్రులు రాజు, జస్వంత్ మాట్లాడదామని ఊరి శివారుకు పిలిచారు. అలా అతన్ని పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామ శివారుకు తీసుకెళ్లారు. ఎవరూ లేని ప్రదేశం చూసుకొని అటాక్ చేశారు. అతని తీవ్రంగా కొట్టి పక్కనే ఉన్న బండరాయి తలపై మోది హత్య చేశారు.   


హత్యే చేసిన నేరుగా పోలీస్ స్టేషన్‌కు


దొంగిలించిన సెల్‌ఫోన్ తమకు అంటగట్టి పరువు తీయడమే కాకుండా తమను కూడా దొంగలుగా చిత్రీకరించాడన్న కసితో స్నేహితుడ్ని చంపేశారు జస్వంత్, రాజు. కిరాతకంగా ప్రశాంత్‌ను హత్య చేసిన మిత్రులు నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. 


తాండూరు పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన జస్వంత్, రాజు.. తాము ఓ హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. ప్రశాంత్ అనే తమ స్నేహితుడి ఊపిరి తీశామని అంగీకరించారు. ఎందుకు చంపాల్సి వచ్చిందో వివరించి చెప్పారు. లొంగిపోయిన ఇద్దరు నిందితులను పోలీసులు పెద్దేముల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.


వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సెల్‌ఫోన్ మిత్రుల మధ్య చిచ్చు పెట్టడమే కాదు.. హత్యకు కూడా దారి తీసింది.