రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ మళ్లీ జైలుకు వెళ్లనున్నారు. డోరాండా ట్రెజరీ కేసులో లాలూను దోషిగా తేలుస్తూ రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే శిక్షను ఇంకా ఖరారు చేయలేదు. ఈ కేసులో మరో 24 మంది నిందితులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.







దాణా కేసే


ఈ డోరాండ్ ట్రెజరీ కేసు కూడా దాణా కుంభకోణానికి (Fodder Scam) సంబంధించినదే. 1990, 1995 మధ్యకాలంలో డోరాండా ట్రెజరీ నుంచి రూ. 139.35 కోట్ల రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేయడంపై ఈ కేసు నమోదైంది. ఇది దాణా కుంభకోణంలో అతిపెద్ద కేసు.


ఏంటి కేసు


దాణా కుంభకోణానికి సంబంధించి 1996లో సీబీఐ పలు కేసులు నమోదు చేసింది. 170 మందిని నిందితులుగా పేర్కొంది. ఇందులో 55 మంది ఇప్పటికే మృతి చెందారు. మరో ఏడుగురిని ప్రభుత్వ సాక్ష్యులుగా సీబీఐ పేర్కొంది. మరో ఇద్దరు కోర్టు తీర్పు రాకముందే తప్పుచేశామని ఒప్పుకున్నారు. ఆరుగురు ఇప్పటికీ తప్పించుకుని తిరుగుతున్నారు. మరో 99 మంది తీర్పు కోసం వేచి చూస్తున్నారు.


లాలూ ప్రసాద్‌తో పాటు మాజీ ఎంపీ జగదీశ్ శర్మ, డా. ఆర్‌కే రాణా సహా పలువురు ఈ డోరాండా ట్రెజరీ కేసులో నిందితులుగా ఉన్నారు.


బెయిల్


దాణా కుంభకోణానికి సంబంధించిన గత నాలుగు కేసుల్లో లాలూకు 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే ఈ కేసులు అన్నింటిలోనూ లాలూకు పట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.


బిహార్ సీఎంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో పశుసంవర్థక శాఖలో రూ.950 కోట్ల దాణా కుంభకోణం జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో 1996లో ఈ కుంభకోణాన్ని దర్యాప్తు చేసేందుకు సీబీఐ 53 కేసులు నమోదు చేసింది.


Also Read: Covid Update: దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గినట్లేనా? 30 వేల దిగువకు పడిపోయిన కేసులు