Telangana :హైదరాబాద్‌ శివారులోని హయత్‌నగర్‌లో ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. మార్నింగ్ వాక్‌కు వెళ్దామని పిల్లల్ని తీసుకొచ్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వారిని రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 


హయత్‌నగర్‌కు సమీపంలో ఉన్న బీఎన్‌రెడ్డి నగర్‌లో ఉంటున్నాడు అశోక్‌. కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ ఫ్యామిలీని పోషిస్తున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు ఈ రోజు ఆత్మహత్యకు యత్నించాడు. తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉదయం వాకింగ్‌కు వెళ్దామని చెప్పి ఇంటి నుంచి కారులో బయల్దేరాడు. 


హయత్‌నగర్ దాటిన తర్వాత ఇనాంగూడ వద్ద చెరువు ఉంటుంది. కారులో వెళ్తున్న అశోక్‌ సడెన్‌గా తన కారును చెరువులోకి పోనిచ్చాడు. దీంతో ఒక్కసారిగా పిల్లులు కేకలు వేశారు. భయంతో కారు డోర్‌లు తీసుకొని కారుపైకి ఎక్కేశారు. తండ్రి కూడా వారితోపాటే కారు పైభాగాన కూర్చున్నాడు. 


కారు చెరువులోకి వెళ్లడంతో స్థానికులు చూసి కంగారు పడ్డారు. ప్రమాదవశాత్తు చెరువులో కారు పడిపోయిందని ముందు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోపు కారులో ఉన్న వారిని రక్షించారు. తాళ్లను టైర్లను వారికి ఇచ్చి సురక్షితంగా నలుగురిని ఒడ్డుకు చేర్చారు. 


అశోక్‌ను విచారించగా అసలు విషయం చెప్పాడు. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతోనే ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పడంతో అక్కడి వారంతా షాక్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.