Dumka Killing: 


మృతురాలు మైనర్..


ఝార్ఖండ్‌లోని దుంకా జిల్లాలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన సంచలనమైంది. ఈ ఘటనలో బాధితురాలు మృతి చెందింది. అయితే...మొదట ఆమెను మేజర్‌గా భావించిన పోలీసులు సాధారణ కేసు నమోదు చేశారు. అయితే... బాధితురాలు మైనర్ అని...నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌లు వినిపించటం వల్ల మరోసారి పోలీసులు మరోసారి ఆమె వయసుపై ఆరా తీశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఈ విషయంలో జోక్యం చేసుకుని బాధితురాలు మైనర్ అని నిరూపించేందుకు చొరవ చూపించింది. అయితే...ఆమె 10th క్లాస్ మార్క్స్ షీట్ ఆధారంగా ఆమెకు 16 ఏళ్లు మాత్రమేనని గుర్తించారు. మైనర్ అయినందున...నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆగస్టు 23న తన గదిలో నిద్రిస్తున్న బాధితురాలిపై
కిటికీలో నుంచి పెట్రోలో పోసి నిప్పంటించాడు నిందితుడు. నిందితుడు కూడా మైనరే. తనతో చనువుగా మాట్లాడటానికి నిరాకరించిందన్న కోపంతో ఈ పని చేశాడు. 


మార్క్స్ షీట్ ఆధారంగా..


"పోక్సో చట్టం కింద ఉన్న సెక్షన్ల ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేయాలని సూచించాం. బాధితురాలు మైనర్ అని విచారణలో తేలింది" అని CWC ఛైర్‌పర్సన్ అమరేంద్ర కుమార్ వెల్లడించారు. నలుగురు సభ్యులతో కూడిన CWC కమిటీ...బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించింది. ఆమె మార్క్‌ షీట్స్‌ని పరిశీలించి పోలీసులకు అందించింది. "మార్క్ షీట్ ఆధారంగా చూస్తే...ఆమె 2006 నవంబర్ 26న జన్మించినట్టు తేలింది. అంటే ఆమె మైనర్. అందుకే..నిందితుడిపై పోక్సో కేసు తప్పకుండా నమోదు చేయాల్సిందే" అని వివరించారు. అయితే అంతకు ముందు పోలీసులు ఓ విషయం వెల్లడించారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకునే సమయంలో ఆమె తనకు 19 ఏళ్లు
అని చెప్పినట్టు  దుంకా పోలీసులు తెలిపారు. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఝార్ఖండ్ పోలీసులతో మాట్లాడింది. ఈ కేసులో సమగ్రంగా విచారణ జరగాలని కోరింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా దీనిపై స్పందించారు. "వీలైనంత వేగంగా విచారణ జరిపి ఆ రిపోర్ట్‌ను అందజేయాలని డీజీపీకి ఆదేశాలిచ్చాం" అని సోరెన్ ట్వీట్ చేశారు. ఈ కేసుని ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్ట్‌లో విచారించనున్నారు. ఈ దారుణానికి పాల్పడిన మైనర్‌ను ఇప్పటికే అరెస్ట్ చేయగా...ఆ మైనర్‌కు పెట్రోల్ అందించిన మరో వ్యక్తినీ పోలీసులు అరెస్ట్ చేశారు.