Rs.700 Crore Fraud In Hyderabad : రాళ్ల సొమ్ము రాజుల పాలైనట్లు.. కష్టపడి సంపాదించిన సొమ్మును కూడబెట్టుకునేందుకు చూస్తే, అసలు పోయింది.. వడ్డీ పోయింది. మధ్య తరగతి కుటుంబాలు డబ్బు సంపాదనకు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మధ్య తరగతి వాళ్లకు ఏదైనా కాస్త మంచి ఆఫర్‌ వచ్చిందంటే చాలు వస్తువులు ఇబ్బడిముబ్బడిగా కొనేస్తుంటారు. తమ డబ్బులకు ఒక శాతం వడ్డీ ఎక్కువ ఇస్తామంటే, ఆ సంస్థలోనే దాచేసుకుంటారు. అలాంటిది ఏకంగా అధిక వడ్డీ ఇస్తామంటే ఊరుకుంటారా.. ఇప్పుడూ అదే జరిగింది. అధిక వడ్డీ ఆశ చూపెట్టి ప్లేట్ పిరాయించింది మాదాపూర్​లోని డీకేజెడ్​ టెక్నాలజీస్. వందలు, వేలు, లక్షలు కాదు, ఏకంగా ఏడు వందల కోట్లు కొట్టేసింది. దీంతో ఆ సంస్థ మోసం చేసిందంటూ బాధితులు బషీర్​బాగ్​లోని సీసీఎస్​ ముందు ఆందోళనకు దిగారు. ఇదే విషయంపై ఫిర్యాదు చేసి 15 రోజులైనా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.  


55వేల మంది బాధితులు
హైదరాబాద్ నగర వ్యాప్తంగా 18 వేల మంది బాధితులు కంపెనీ ఉచ్చులో చిక్కుకున్నారు. వీరే కాకుండా మూడు రాష్ట్రాల్లో 55 వేల మందికి పైగా ఈ సంస్థ బాధితులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో డబ్బులు పోగొట్టుకున్న వందలాది బాధితులు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు. మీడియాతో తమ బాధను పంచుకున్నారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోయారు. బాధితుల్లో ఒకే వర్గానికి చెందిన వారే భారీగా ఉన్నారు.  సదరు యాజమాన్యం కంపెనీపై నమ్మకం కలిగించేందుకు సంస్థ తొలుత ఇన్వెస్టర్లకు లాభాల ఆశ చూపించింది. పెట్టుబడి పెట్టిన  కొన్ని నెలల పాటు ఇన్వెస్టర్ల అకౌంట్‌లో డబ్బులు జమ చేశారు ఈ కేటుగాళ్లు. సోషల్ మీడియా ఇన్ల్ఫ్యూయెన్సర్లతో కూడా భారీగా ప్రమోషన్లు చేయించారు. చివరికి 700 కోట్ల రూపాయల వరకు దండుకుని కేటుగాళ్లు పరారయ్యారు. లాభాలు వస్తుండటంతో.. అప్పు చేసి, ఉన్న బంగారం అమ్మి మరీ బాధితులు పెట్టుబడులు పెట్టారు. అడ్డంగా మోసపోయారు. ఇప్పుడు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు. 


Also Read: కదులుతున్న ట్రైన్‌లో బాలికపై రైల్వే ఉద్యోగి దారుణం! చావగొట్టిన ప్రయాణికులు


పోలీసులు దర్యాప్తు
ఈ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డికేజెడ్ టెక్నాలజీస్ నిర్వాహకులు పరారీలో ఉండడంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఛీటింగ్ కేసు బయటికి రావడంతో వేలాది మంది బాధితులు బయటికి వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నారు. మాదాపూర్‌లోని సమృద్ధి వశ్యం భవనంలో ఇక్బా ల్, రాహిల్ డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థను ఏర్పాటు చేశారు. తమ సంస్థ ద్వారా ఆహార ధాన్యాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు తదితరాలను ఆన్‌లైన్‌లో అమ్ముతామని నమ్మించారు. వస్తువులను విక్రయించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్, యాప్‌ను రూపొందించారు. అంతేకాకుండా తమ వద్ద పెట్టుబడి పెట్టిన వారికి ప్రతి నెలా 8 నుంచి 10 శాతం వడ్డీ ఇస్తామని ప్రకటించారు. దీంతో చాలా మంది మొదట్లో తక్కువే  పెట్టుబడి పెట్టారు. వీరికి భారీగా వడ్డీ చెల్లించడంతో భారీ ఎత్తున డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పడంతో అప్పులు చెసి మరీ  భారీ ఎత్తున డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. ఇలా దాదాపుగా 60 వేల మంది బాధితుల నుంచి రూ.700 కోట్లు వసూలు చేసిన నిందితులు తర్వాత వడ్డీ చెల్లించడం ఆపేశారు. ఇదే సంస్థలో ముందుగా బాధితులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


పండుగల ఆఫర్లు…
 పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసిన నిందితులు.. ఎక్కువ పెట్టుబడి పెట్టిన వారికి 12 నుంచి 13.5 శాతం వడ్డీ ఇస్తామని ప్రచారం చేశారు. తాము తయారు చేసిన యాప్ ద్వారా వస్తువులు కొనుగోలు చేసిన వారికి 10 నుంచి 15 శాతం వరకు ప్రత్యేక రాయితీ ఉంటుందని భావిస్తున్నారు. తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి ప్రత్యేక రాయితీలు ఇస్తామని చెప్పారు. ఇలాంటి మాటలు నమ్మిన దాదాపు 55వేల మంది రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. చాలా మంది బాధితులు తమ సొంత డబ్బుతో పాటు చిట్టీలు కూడా ఎత్తి అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. లక్ష రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. అధిక వడ్డీకి ఆశపడి పెట్టుబడి పెట్టి ఇప్పుడు నానా బాధలు పడుతున్నారు. దాచుకున్న సొమ్ముతోపాటు అప్పుగా తీసుకుని వచ్చి పెట్టుబడి పెట్టడంతో వాటిని నెలనెలా కట్టలేక కన్నీటి పర్యంతం అవుతున్నారు.  


Also Read: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు