Cyber Fraud in Delhi: 


రూ.90 వేలు మాయం..


సైబర్‌ నేరాలపై ప్రభుత్వాలు, పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొందరు ఆ వలలో అమాయకంగా చిక్కుకుంటున్నారు. ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఇలాగే మోసపోయింది. ఓ తాలి కొంటే మరో తాలి (Taali-Food Plate) ఉచితంగా ఇస్తామని ఆఫర్‌  పెడితే..నమ్మి నిండా మునిగింది. వెస్ట్ ఢిల్లీకి చెందిన బాధితురాలు రూ.90 వేలు పోగొట్టుకుంది. ఈ ఆఫర్‌ కావాలంటే ఓ యాప్ డౌన్‌లోడ్ చేయాలని సైబర్ నేరగాళ్లు చెప్పారు. వాళ్లు చెప్పిన వెంటనే ఆమె యాప్‌ని డౌన్‌లోడ్ చేసింది. ఆ తరవాత రూ.90 వేలు ఆ నేరగాళ్ల అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయిపోయాయి. ఓ బ్యాంక్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న బాధితురాలు...ఫేస్‌బుక్‌లో పోస్ట్ చూసి నమ్మినట్టు చెప్పింది. ఫేస్‌బుక్‌లో ఎవరో ఆఫర్ పెట్టారని తన ఫ్రెండ్‌ చెప్పిందని అందుకే డౌన్‌లోడ్ చేశానని పోలీసులకు వివరించింది. గతేడాది నవంబర్ 27న ఆమె ఆ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసింది. ఆ సైట్‌లో ఇచ్చిన నంబర్‌కి కాల్ చేసింది. ఆఫర్‌ గురించి ఆరా తీసింది. అయితే..ఆమె కాల్ చేసినప్పుడు అటు నుంచి ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ఆ తరవాత ఓ వ్యక్తి ఆమెకు కాల్ చేశాడు. సాగర్ రత్న పేరిట ఈ ఆఫర్‌ని పెట్టినట్టు మాయ మాటలు చెప్పాడు. 


"నాకో వ్యక్తి ఓ లింక్ పంపించాడు. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేయాలని చెప్పాడు. ఆఫర్‌ కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందేనని కండీషన్ పెట్టాడు. అంతే కాదు. ఆ యాప్‌ని యాక్సెస్ చేయడానికి అసరమైన లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు కూడా పంపించాడు. యాప్‌లో రిజిస్టర్ అయిన తరవాతే ఆఫర్ వర్తిస్తుందని చెప్పాడు. నేను ఆ లింక్ ఓపెన్ చేశాను. యాప్ డౌన్‌లోడ్ అయింది. ఎప్పుడైతే వాళ్లిచ్చిన ID,పాస్‌వర్డ్‌లు కొట్టానే వెంటనే నా ఫోన్ వాళ్ల కంట్రోల్‌లోకి వెళ్లిపోయింది. ఫోన్‌ని హ్యాక్ చేసి రూ.40 వేలు చోరీ చేశారు. ఆ తరవాత కాసేపటికే మరో రూ.50 వేలు డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. నా క్రెడిట్ కార్డ్‌లో నుంచి పేటీఎమ్‌కి  ఆటోమెటిక్‌గా మనీ ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. అక్కడి నుంచి వాళ్ల అకౌంట్‌లోకి వెళ్లిపోయాయి. ఇదంతా నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. నా డిటెయిల్స్ ఏమీ ఇవ్వకుండానే ఇదంతా జరిగిపోయింది"


- బాధితురాలు 


దీనిపై సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. అనవసరపు యాప్స్‌ని డౌన్‌లోడ్ చేయొద్దని సూచించారు. ఎన్నోసార్లు దీనిపై అవగాహన కల్పించినా...కొందరు వలలో చిక్కుకుంటున్నారని, ఆ మనీని రికవర్ చేయడం కూడా సాధ్యపడడం లేదని వెల్లడించారు.  ఈ మధ్య కాలంలో పలువురు సెలబ్రిటీలు తాము సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయామంటూ లబోదిబోమన్నారు. ఈ కేటుగాళ్ల చేతిలో మోసపోయిన ప్రముఖుల జాబితాలో సీనియర్ హీరోయిన్‌ నగ్మ చేరారు. బ్యాంక్ అధికారులమంటూ ఆమెను బురిడీ కొట్టించారు. సైబర్ నేరగాళ్లు విసిరిన వలలో చిక్కిన నగ్మ రూ.లక్ష పోగొట్టుకున్నారు.


Also Read: Muhammad Iqbal: సారే జహాసే అచ్ఛా రచయిత ఇక్బాల్‌ పాఠం తొలగింపు, ఢిల్లీ యూనివర్సిటీ నిర్ణయం