Delhi Crime News:


ఢిల్లీలో హత్య..


ఢిల్లీలో 17 ఏళ్ల బాలుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. . మందు తాగుదామని పిలిచి ఫ్రెండ్‌ని చంపేశారు యువకులు. సౌత్ ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 15న ఉదయం పోలీసులకు ఈ హత్యకు సంబంధించిన సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాలుడి శరీరంపై కత్తి గాట్లున్నాయి. పొట్ట, ఛాతి, ముఖం, మెడపై లోతైన గాయాలు కనిపించినట్టు పోలీసులు వెల్లడించారు. విచక్షణారహితంగా పొడిచి చంపినట్టు చెప్పారు. మృతుడి పేరు వివేక్. బేగంపూర్‌కి చెందిన వివేక్‌ని చంపేందుకు ఐదుగురు స్నేహితులు పక్కా ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ ప్రకారం వివేక్‌ని మందు తాగేందుకు పిలిచారు. ఓ ఫ్రెండ్ తనను మాల్వియా నగర్‌లోని ఓ పార్క్‌కి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ 5గురు ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారు. అందరూ కలిసి మద్యం సేవించారు. ఆ తరవాత ఐదుగురు కలిసి కత్తులు, రాళ్లతో వివేక్‌పై దాడి చేశారు. వీళ్లలో ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది నెలల క్రితం వివేక్‌కి, నిందితుల్లో ఓ వ్యక్తి గొడవైంది. వివేక్‌ ఆ వ్యక్తిని చితకబాదాడు. అప్పటి నుంచి వివేక్‌ని ఎలాగైనా చంపాలని పగతో రగిలిపోతున్నాడు. ఇదే విషయం మిగతా ఫ్రెండ్స్‌తో చెప్పి ఇలా పార్క్‌లో హత్య చేశాడు నిందితుడు. ఘటనా స్థలం వద్ద రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను విచారిస్తున్నారు.