Delhi Murder Case: ఢిల్లీలో మైనర్‌ను హత్య చేసిన నిందితుడు సాహిల్.. పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు. తాను ప్రియురాలిని కత్తితో నరికి చంపినందుకు ఏమాత్రం పశ్చాత్తాప పడడం లేదని సాహిల్ పోలీసుల ముందు వెల్లడించాడు. చాలా రోజులుగా ఆ అమ్మాయి తనను పట్టించుకోవడం లేదని.. అందుకే ఆమెను హత్య చేసినట్లు వివరించాడు. సోమవారం (మే 29) రోజు ఢిల్లీలోని షహబాద్ డెయిరీలో 16 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి కత్తితో దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా బండరాయి తీసుకుని బాలిక తలపై దాడి చేశాడు. ఈ దారుణ ఘటన సీసీటీవీలో రికార్డు అయింది. ఘటన జరిగిన రోజునే ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని సాహిల్‌గా గుర్తించారు. అయితే సాహిల్ ఏసీ, ఫ్రిజ్ రిపేరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.


పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన సాహిల్


నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత ఢిల్లీ పోలీసులు విచారించగా.. అతడు నేరాన్ని అంగీకరించాడు. తామిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నామని.. కానీ కొద్ది రోజులుగా ప్రేయసి తనను పట్టించుకోవడం మానేసిందని చెప్పాడు. దాని వల్లే తనకు విపరీతంగా కోపం వచ్చి ఆమను హత్యే చేసినట్లు వివరించాడు. 


హత్యకు ఉపయోగించిన కత్తిని రిథాలాలో దాచిన నిందితుడు


హత్యానంతరం రిథాలాకు వెళ్లి అక్కడ హత్యకు ఉపయోగించిన కత్తిని దాచి పెట్టినట్లు సాహిల్ విచారణలో చెప్పాడు. దీని తర్వాత సాహిల్ బులంద్‌షహర్ వెళ్లాడు. అతను బులంద్‌షహర్ చేరుకోవడానికి రెండు సార్లు బస్‌లు మారుతూ ప్రయాణం చేశాడు. సాహిల్ చాకచక్యంగా తప్పించుకున్నప్పటికీ.. పోలీసులు అతడిని పట్టుకున్నారు. అయితే హత్య చేసిన తర్వాత సాహిల్ తన ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయగా.. పోలీసులు దాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 


Also Read: ఢిల్లీలో నడిరోడ్డుపై అందరూ చూస్తూండగానే బాలిక హత్య - నిందితుడు అరెస్ట్ !


సాహిల్ చాలా మందితో మాట్లాడుతున్నట్లు తెలుసుకున్న బాలిక


సాహిల్ చాలా మంది అమ్మాయిలతో స్నేహం చేస్తున్నాడని ఇన్‌స్టా గ్రామ్ చాట్ ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే ఇదే విషయాన్ని బాధితురాలు గుర్తించి.. సాహిల్ తో మాట్లాడడం మానేసింది. ఫోన్ నెంబర్ ను బ్లాక్ లో పెట్టి అతడికి దూరంగా ఉంటోంది. కానీ సాహిల్ మాత్రం ప్రేయసి తనతో మాట్లాడడం లేదని... ఆమెను చంపేశాడు. 






ఎలా చంపేశాడంటే?


అమ్మాయి .. తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఆమె అలా వస్తుందని తెలిసి సాహిల్ అడ్డగించాడు. తనతో ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలంటూ వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత విచక్షణ కోల్పోయిన సాహిల్.. 16 ఏళ్ల సాక్షిని అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆవేశంతో ఊగిపోయిన సాహిల్.. అమ్మాయి సాక్షిని నడిరోడ్డుపైనే.. కత్తితో 20 సార్లు పొడిచాడు. అప్పటికీ కసి తీరకపోవటంతో.. రోడ్డుపై ఉన్న బండ రాయి తీసుకుని అమ్మాయి ముఖంపై పలుమార్లు  దాడి చేశాడు. తీవ్ర గాయాలతో సాక్షి అక్కడికక్కడే చనిపోయింది. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. నిర్మానుష్యమైన ప్రాంతంలోనూ ఇలాంటి ఘటన జరిగితే.. ఎవరూ లేరని అనుకోవచ్చు.. కానీ నడిరోడ్డుపై, రద్దీగా ఉండే వీధిలో ఓ అమ్మాయిని అత్యంత కిరాతకంగా కత్తితో పొడుస్తున్నా.. రాయితో కొడుతున్నా ఒక్కరు అంటే ఒక్కరు కూడా అడ్డుకోకపోగా.. మనకు ఎందుకులే అంటూ చూస్తూ ఉండిపోయారు స్థానికులు.