Delhi Crime: 


ఢిల్లీలో దారుణం...


ఢిల్లీలోని మాలవియా నగర్‌లో ఓ కాలేజ్‌ బయట ఓ యువతి దారుణ హత్యకు గురైంది. కమలా నెహ్రూ కాలేజ్‌లో చదువుతున్న నగ్రీస్‌ తలపై రాడ్‌తో కొట్టాడు ఓ యువకుడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...నగ్రీస్ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఓ పార్క్‌కి వచ్చింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తనను పెళ్లి చేసుకోవాలని బాయ్‌ఫ్రెండ్‌ ఒత్తిడి చేశాడు. అందుకు నగ్రీస్ ఒప్పుకోలేదు. ఈ కోపంతో ఇనుప రాడ్‌తో బలంగా ఆమె తలపై కొట్టాడు. ప్రాథమిక విచారణలో తేలిందేంటంటే...నగ్రీస్ ఫ్యామిలీ ఈ ఇద్దరి పెళ్లికి అంగీకరించలేదు. చాలా రోజులుగా నగ్రీస్ తన బాయ్‌ఫ్రెండ్‌ ఇర్ఫాన్‌తో మాట్లాడడం మానేసింది. ఈ ఏడాదే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నగ్రీస్...ఓ కోచింగ్ సెంటర్‌కి వెళ్తోంది. అప్పుడే బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పార్క్‌కి వెళ్లింది. అక్కడే హత్యకు గురైంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి సమీపంలోనే ఓ ఇనుప రాడ్‌ను గుర్తించారు. నగ్రీస్ తలపై బలమైన గాయాలున్నట్టు వెల్లడించారు. నిందితుడు ఇర్ఫాన్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. 


"ఓ పాతికేళ్ల అమ్మాయి పార్క్‌లో హత్యకు గురైందని మాకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లాం. ఆమె డెడ్‌బాడీకి సమీపంలోనే ఓ రాడ్‌ దొరికింది. ఆ రాడ్‌తోనే ఇర్ఫాన్‌ ఆమెను కొట్టి చంపినట్టు ప్రాథమిక విచారణలో తేలింది"


- పోలీసులు






ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ స్పందించారు. పార్క్‌లో ఓ రాడ్‌తో కొట్టి చంపినా రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 


" జనాలు ఎక్కువగా ఉండే మాలవియా నగర్ లాంటి ప్రాంతాల్లోనూ ఓ అమ్మాయిని ఇలా బహిరంగంగా రాడ్‌తో కొట్టి చంపారు. ఢిల్లీలో మహిళలకు అసలు రక్షణ లేకుండా పోతోంది. బాధితుల పేర్లు మారుతున్నాయే తప్ప వాళ్లపై జరుగుతున్న దాడులు మాత్రం ఆగడం లేదు"


- స్వాతి మలివాల్, ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్