Madanapalle Crime News: తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, కుమార్తెను ఆ స్థాయిలోనే చదివించాడు. మంచి వ్యక్తి చేతిలో పెట్టి తల్లిలేని బిడ్డను జాగ్రత్తగా సాగనంపాలని చూశాడు. చెడు తిరుగుళ్లకు అలవాటు పడిన ఆ యువతి మాత్రం అందుకే ఒప్పకోలేదు. అప్పుడే నాకు పెళ్లి ఏంటీ అంటూ తిరగబడింది. తండ్రి చెప్పిన మాటలు రుచించలేదామెకు. అంతే కోపంతో చేతికి ఏది దొరికితే దాంతో కొట్టి చంపేసింది. చివరకు కాలు జారి పడిపోయారని నాటకమాడింది. 


అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈనెల 13న ఈ దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడిన తండ్రినే కడతేర్చిన క్రిమినల్ కుమార్తె కథ ఇది. పీఅండ్‌టీ కాలనీలో ఉంటున్న దొరస్వామికి 62 ఏళ్లు. ఎస్జీటీ టీచర్‌గా పని చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితమే భార్య చనిపోయారు. వీళ్లకు ఒక్కగానొక్క కుమార్తె. పేరు హరిత. ఆమెను బీఎస్సీ బీఈడీ వరకు చదివించారు. కుమార్తె పెళ్లి కోసం డబ్బులు కూడా కూడబెట్టారు. నగలు కూడా కొనిపెట్టారు. 


భార్య మరణంతో దిగాలుపడిపోయిన దొరస్వామి నగదు, నగలను కుమార్తెకు ఇచ్చేశాడు. తన పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదని ఆమెకు జాగ్రత్తలు చెప్పారు.  ఇదే ఆయన చేసిన తప్పు అయింది. చేతికి డబ్బులు రావడంతోనే హరితలో భారీ మార్పు వచ్చింది. ఇష్టం వచ్చినట్టు తిరగడం మొదలు పెట్టింది. 


తప్పుడు మార్గంలో వెళ్లిన హరిత... ముందు అదే ప్రాంతానికి చెందిన రమేష్‌తో సన్నిహితంగా మెలిగింది. అంతే కాదు తన వద్ద ఉన్న నగలు ఆ వ్యక్తికి అప్పగించింది. వాటిని రమేష్‌ తాకట్టు పెట్టి పదకొండున్నర లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అదే టైంలో సాయికృష్ణ అనే మరో వ్యక్తితో కూడా చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. అతికి ఓ 8 లక్షలు ఇచ్చింది. మూడో వ్యక్తి హరీష్‌రెడ్డితో కూడా స్నేహగీతం ఆలపించింది. 


ఇలా ఎవరికి పడితే వాళ్లకు స్నేహం పేరుతో అప్పులు ఇస్తున్న హరిత ప్రవర్తన దొరస్వామికి నచ్చలేదు. పెళ్లి చేస్తే దారిలోకి వస్తుందని సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని కుమార్తె హరితకు చెప్పాడు దొరస్వామి. తనకు పెళ్లే వద్దని మంకుపట్టు పట్టింది. ఈ విషయంలో కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 


పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి తండ్రి నుంచి ఎక్కువ కావడంతో 13న ఇంట్లో తండ్రిని హతమార్చింది హరిత. చపాతీ కర్ర, పరీక్షలు రాసే అట్ట, తాళం కప్ప, ఇలా ఏది దొరికితే దాంతో తండ్రిని చావబాదింది. అప్పటికే పెద్ద వయసు ఉన్న దొరస్వామి ఆ దెబ్బలకు తాళలేక చనిపోయాడు. 


ఇంట్లో రోజూ గొడవలు సర్వసాధారణమే అయినా ఆ రోజు ఎక్కువ కేకలు వినిపించడంతో చుట్టుపక్కల వాళ్లు దొరస్వామి ఇంటికి వెళ్లి చూశారు. అప్పటికే ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నాడు. చూస్తే ప్రాణాలు లేవు. ఏం జరిగిందని కుమార్తె హరితను అడిగితే... ఘర్షణలో కాలుజారి పడిపోయారని చెప్పింది. 


వ్యక్తి చనిపోయిన సంగతిని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి విచారిస్తే తన తండ్రి కాలు జారి పడిపోయారని కుమార్తె హరిత చెప్పింది. ఊరి వాళ్లను అడిగితే ఆమె తిరుగుళ్లు, రోజూ జరిగే గొడవలు గురించి పూసగుచ్చినట్టు వివరించారు. పోస్టు మార్టంలో కూడా తలపై దెబ్బలు ఉన్నట్టు రావడంతో హరితపై అనుమానం వచ్చింది. 


హరితపై అనుమానం వ్యక్తం చేసినపోలీసులు తమ స్టైల్‌లో విచారించారు. అంతే నిజాలు తన్నుకుంటూ వచ్చాయి. తన పెళ్లి ప్రస్తావన పదే పదే చేస్తుండటంతో భరంచలేక తండ్రిని కడతేర్చినట్టు కుమార్తె హరిత అంగీకరించింది. వెంటనే ఆమెను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.