Cyberabad SOT Police Arrested Ganja Gang and Seized 30 Kgs Of Ganja: హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసుల నిఘా పెరిగింది. ఎక్కడైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వాహనాలు, మనుషులను చెక్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ఫోకస్ చేసింది. సైబరాబాద్ SOT పోలీసులు గంజాయి స్మగ్లింగ్ ముఠాని అరెస్ట్ చేసి 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.10,50,000 (10 లక్షల 50 వేల రూపాయలు) ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. 


అశోక్ లే ల్యాండ్ ట్రాలీ ఆటో, FZ బైక్‌ను వాటితో ప్రయాణిస్తున్న చార్మినార్ ప్రాంతానికి చెందిన అయాన్ అలీ ఖాన్, మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులను మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో రాజేంద్రనగర్ SOT ఇన్ స్పెక్టర్, ఆయన బృందం ఈ గ్యాంగ్ ని పట్టుకుని తనఖీ చేయగా ఆటో ట్రాలీలో లగేజీ బ్యాగులలో దాచిన 30 కేజీ ల గంజాయి లభ్యమైంది. ఒరిస్సాకు చెందిన అయాన్ దీపక్ పాటిల్ అనే గంజాయి స్మగ్లర్ నుంచి 30 కేజీల గంజాయిని భద్రాచలం వద్ద కేజీ రూ. 5,000/- చొప్పున కొనుగోలు చేసినట్లు విచారణలో నిందితులు తెలిపారు. 


గంజాయి కొనుగోలు చేసిన తరువాత భద్రాచలం నుంచి ట్రాలీ ఆటోలో బయలుదేరారు. ఎన్నికల సందర్భంగా దారిపొడుగునా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లను తప్పించుకుని వస్తున్నారు. పోలీసుల తనిఖీలకు దొరకకుండా అతని స్నేహితుడు మొయినుద్దీన్‌ బైక్‌పై భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు పైలేటింగ్ చేయగా సురక్షితంగా నగరానికి చేరుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. స్మగ్లింగ్ చేసి తీసుకువచ్చిన గంజాయిని కేజీకి రు. 35,000/- చొప్పున స్థానికంగా చిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నట్లు నిందితులు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్‌ల కారణంగా కేజీ 25 వేలు అమ్మాల్సిన గంజాయిని 35 వేలకు అమ్ముతున్నట్లు నిందితులు చెప్పారు. 


నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 30 కేజీల గంజాయి (15 పాకెట్లు ఒక్కొక్కటి 2 కేజీలు) - విలువ రూ.10,50,000, రూ. 10 లక్షల విలువైన అశోక్ లేలాండ్ ట్రాలీ ఆటో, 1 లక్ష విలువైన FZ ద్విచక్ర వాహనంతో పాటు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
SOT చేసిన విచారణ లో మొహమ్మద్ అయాన్ అలీ ఖాన్ పై పలు కేసులున్నాయి. పలుమార్లు అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. నార్సింగి, మేడిపల్లి, లంగర్ హౌస్, మలక్ పేట, సైదాబాద్, మేడిపల్లి పోలీస్ స్టేషన్లలో చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఇతని మీద గతంలో హైదరాబాద్ పోలీసులు PD act కూడా పెట్టారు.


గంజాయి స్మగ్లర్ల వివరాలు
 1)  మొహమ్మద్ అయాన్ అలీ ఖాన్ @ అయాన్ S/o మహమ్మద్ ఖాజం అలీ, వయస్సు 36, Occ కారు డ్రైవర్, R/o H.No.  18-8-646/a/114, ఈడీ బజార్, యాకుత్‌పురా, రైల్వే బ్రిడ్జి దగ్గర, చార్మినార్, హైదరాబాద్
 2).  మహమ్మద్ మొయిన్ ఉద్దీన్ S/o మహమ్మద్ సత్తార్, వయస్సు 38, Occ: డ్రైవర్, R/o H.No.18-8-646/b/23/A, జావీద్ నగర్, తాలబ్‌కట్ట, చార్మినార్, హైదరాబాద్.  (పైలట్ - ద్విచక్ర వాహనం) కో పెడ్లర్
 3) దీపక్ పాటిల్ R/o ఒరిస్సా (SUPPLIER - పరారీలో)