Bairi Naresh Bail :దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ కి బెయిల్ మంజూరు అయింది. చర్లపల్లి జైలు నుంచి బైరి నరేష్ బెయిల్ పై విడుదల అయ్యారు. బైరి నరేష్ కు కోడంగల్ కోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  దాదాపు 45 రోజుల పాటు నరేష్ జైల్లో ఉన్నాడు. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‭కి కోడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కొడంగల్ కోర్టు తెలిపింది.  దాదాపు 45 రోజుల పాటు జైలులో ఉన్న నరేష్‭ను చర్లపల్లి జైలు నుంచి పోలీసులు గురువారం విడుదల చేశారు. అయ్యప్ప స్వాములపై బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బైరి నరేష్ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి భక్తులు, హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. అతడిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కొడంగల్‌ పోలీసులు బైరి నరేష్‌తో పాటు అంబేడ్కర్‌ జాతర కార్యక్రమ నిర్వాహకుడు డోలు హనుమంతును ఇటీవల అరెస్టు చేశారు. 


ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు 


అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి బైరి నరేష్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యాడు. అయితే విచారణలో తాను ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకు తెలిపాడు. అతడు నేరం అంగీకరించినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌ పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతోనే బైరి నరేష్ ఈ వ్యాఖ్యలు చేశాడని కొడంగల్ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలిపారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన హనుమంతు ఉద్దేశపూర్వకంగానే బైరి నరేష్‌ ఈ కార్యక్రమానికి పిలిచినట్లు పోలీసులకు తెలిపాడు. బైరీ నరేష్‌పై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. హనుమకొండలో రెండు, నవాబ్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఒక కేసు అతడిపై నమోదు అయినట్లు కోర్టుకు తెలిపారు. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యల కేసుపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.  


దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు 


డిసెంబర్ నెలఖారులో కొడంగల్‌లో నిర్వహించిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అయ్యప్పస్వామిపై బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయ్యప్ప నువ్వు నా కొంప ముంచావంటూ బహిరంగ సభలో అయ్యప్పస్వామిని కించపరుస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడిపై హిందూ సంఘాలు, అయ్యప్ప మాలధారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు ఆందోళనలు చేపట్టి బైరి నరేష్ పై ఫిర్యాదు చేశారు.  దీంతో అనేక పోలీస్ స్టేషన్‌లలో బైరి నరేష్ పై కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి పరారీలో ఉన్న బైరి నరేష్‌ను రెండ్రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. కరీంనగర్ వెళ్తుండగా వరంగల్‌లో అతడిని అరెస్టు చేశారు.  బైరి నరేష్‌కు చట్ట ప్రకారం శిక్ష పడేటట్లు చూస్తామని అప్పట్లో పోలీసులు తెలిపారు. అతడిపై FIR No. 185/2022 U/s 153-A, 295-A, 298, 505(2) IPC of PS Kodangal సెక్షన్ల కింద కేసులు పెట్టామన్నారు. ఎక్కడైనా మీటింగ్ లు నిర్వహించేటప్పుడు మీటింగ్ నిర్వాహకులు  ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదని పోలీసులు కోరారు. అలాంటి వారిని ప్రోత్సహించి శాంతికి విఘాతం కలుగ చేసిన నిర్వాహకులపైన కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.