RG Kar Case Latest News: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొల్‌కత ఆర్జీకర్ రేప్ అండ్ మర్డర్‌ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరనీ ప్రశ్నిస్తున్న దర్యాప్తు అధికారులు.. గురువారం నాడు అధికార తృణమూల్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుదీప్తో రాయ్‌ను కూడా ప్రశ్నించింది. గురువారం మధ్యాహ్నం కోల్‌కతలోని సింధీ ప్రాంతంలంలోని సుదీప్తోరాయ్‌ నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు.. ఆయన్ను ప్రశ్నించినట్లు సుదీప్తో తెలిపారు. స్వయంగా వైద్యుడైన సుదీప్తోరాయ్‌.. ఘోరం జరిగిన ఆర్జీకర్ ఆస్పత్రి పేషెంట్స్ వెల్‌ఫేర్ కమిటీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అధికారులకు దర్యాప్తులో సహకరిస్తానని విచారణ అనంతరం ఆయన ప్రకటించారు. అటు ఈ ఘటకు సంబంధించి రంగంలోకి దిగిన ఈడీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు కూడా నిర్వహిస్తోంది.


 ఆగస్టు 9న ఆర్జీకర్ ఆస్పత్రి జూనియర్ వైద్యురాలపై దారుణంగా జరగ్గా.. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా నిరనలు వ్యక్తం అవుతున్నాయి. కోల్‌కతలోని జూనియర్‌ వైద్యులు ఆగస్టు 10 నుంచి నిరసనల్లో పాల్గొంటున్నారు.


జూనియర్ వైద్యులతో చర్చలకు సిద్ధమన్న దీదీ కొన్ని కండిషన్లు కూడా పెట్టారు. తొలుత చర్చలను బహిష్కరించిన జూడాలు ఈ సాయంత్రం 5గంటలకు చర్చల కోసం వెళ్లారు. ఆర్జీకర్ ఆస్పత్రి ఘటనలో బాధితురాలికి న్యాయం జరగడం సహా.. ఇతర అంశాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎదుటే చర్చలకు పట్టుపట్టిన జూడాలు గురువారం సాయంత్రం సెక్రటేరియట్‌కు వెళ్లారు. తొలుత 15 మంది జూనియర్ డాక్టర్లు మాత్రమే చర్చలకు రావాలని మమత సర్కారు కండీషన్ పెట్టగా.. తీవ్రంగా వ్యతిరేకించారు. 30 మందిని రానివ్వడానికి సిద్ధంగా ఉంటేనే వస్తామని తేల్చి చెప్పడంతో 30 మంది జూనియర్ వైద్యుల బృందం చర్చలకు వెళ్లింది. అంతేకాకుండా చర్చలను లైవ్‌ స్ట్రీమ్ ఇవ్వాలని జూడాలు చేసిన డిమాండ్‌ను తొలుత వ్యతిరేకించిన బెంగాల్‌ స్టేట్‌ చీఫ్ సెక్రెటరీ తర్వాత అంగీకారం తెలిపారు.


ఓపెన్‌ మైండ్‌తో చర్చలకు వెళ్తున్నట్లు తెలిపిన జూడాలు తమ సహచర వైద్యురాలికి న్యాయం చేయడమే తమ ప్రధాన అజెండాగా పేర్కొన్నారు.  అంతకు ముందు ఈ మెయిల్‌ ద్వారా ప్రభుత్వానికి హాజరవబోయే వారి సమాచారాన్ని తెలిపిన జూడాలు.. రాష్ట్రంలోని 26 వైద్య కళాశాలల నుంచి ఒక్కొక్క ప్రతినిధి హాజరవుతారని మొత్తంగా 30 మందిమి వస్తామని వివరించారు. ఇంతకు ముందు రెండు సార్లు ప్రభుత్వం చర్చలకు పిలిచినా జూడాల డిమాండ్‌లకు సర్కార్‌ నో చెప్పడంతో అవి జరగలేదు. ఈ సారి ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గడంతో జూడాలు చర్చలకు వెళ్లారు.


అంతకు ముందు ఆర్జీకర్ ఆస్పత్రి ఆవరణలో వేలమంది జూడాలు నిరసనలు తెలిపే ప్రదేశంలో ఒక అన్‌ ఐడెంటిఫైడ్ బ్యాగ్ పడి ఉండడం కలకలం రేపింది. అందులో బాంబు ఉండి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌ను పిలిపించి తనిఖీలు కూడా జరిపించారు.


ఆగస్టు 9 న ఆర్జీకర్ ఆస్పత్రి నాల్గవ అంతస్తులోని సెమినార్‌ హాల్‌లో ఆ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యురాలుగా పనిచేస్తున్న  పీజీ వైద్య విద్యార్థిని అమానుషంగా అత్యాచారం చేయపడి ఆ తర్వాత హత్యకు గురైంది. ఈ ఘటనలో బెంగాల్ ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై విమర్శలు రావడంతో దీదీ సర్కారు కేసును సీబీఐకి అప్పగించింది. అప్పటికే పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకోగా సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. వాళ్లకు ఈ దర్యాప్తులో అందిన లీడ్స్‌తో సంబంధం ఉన్న అందర్నీ ప్రశ్నిస్తూ వస్తున్న అధికారులు.. టీఎంసీ MLA సుదీప్తోరాయ్‌ను కూడా ప్రశ్నించారు.