Holy Bath In Ganga River: కాలం మారుతోంది. టెక్నాలజీ పెరిగింది. అన్ని విషయాలపై ప్రజలు అవగాహన పెరుగుతోంది. అయినా కొన్ని చోట్ల మాత్రం కొన్ని నమ్మకాలు అలాగే కొనసాగుతున్నాయి. వాటి కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.  ఇంటి ఘటనే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో విషాద ఘటన జరిగింది. ఓ మహిళ తన మేనల్లుడి చావుకు కారణమైంది. గంగానదిలో ముగినితే క్యాన్సర్ తగ్గిపోతుందంటూ నీట ముంచి చంపేసింది. వివరాలు.. సుధా అనే మహిళ తన మేనళ్లుడు రవితో కలిసి బుధవారం (జనవరి 24) మధ్యాహ్నం హరిద్వార్‌ వెళ్లింది. రవి కొద్ది కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. గంగానదిలో మునిగితే క్యాన్సర్ తగ్గిపోతుందంటూ హర్ కీ పౌరీ ఘాట్ వద్దకు రవిని తీసుకెళ్లింది. 






గంగానది అన్ని రోగాలను తగ్గిస్తుందని, ఐదు నిమిషాలు బయటకు రాకుండా ఉంటే బ్లడ్ క్యాన్సర్ తగ్గిపోతుందని చెప్పింది. రవిని ఐదు నిమిషాల పాటు నదిలో స్నానం చేయించింది. సుధ చేస్తున్న పనిని గమనించిన కొందరు బాలుడిని నదిలో నుంచి బయటకు తీసుకొచ్చారు. అయితే, అప్పటికి అతను చనిపోయాడు. ఆ సమయంలో మహిళ నవ్వుతూ కనిపించింది. పైగా అక్కడున్న వారితో గొడవకు దిగింది.


వీడియోలో సుధ మరో ఇద్దరితో కలిసి రవిని గంగా నదిలో ముంచినట్లు కనిపించింది. కొందరు వ్యక్తులు జోక్యం చేసుకుని బాలుడిని బయటకు తీసుకురావాలని కోరడంతో, ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు రవిని నదిలో నుంచి బలవంతంగా బయటకు తీయగా, ఆమె వారిని అడ్డుకుని ఒకరిని కొట్టడానికి ప్రయత్నించింది. రవి మరణించాడని స్థానికులు చెప్తుంటే ఆమె మృతదేహం దగ్గర కూర్చుని నవ్వుతూ కనిపించింది.


అందరు వీడియోలు రికార్డింగ్ చేస్తూ ఉండాలని, రవి మేల్కొంటాడని, ఇది తన వాగ్దానం అంటూ ఆమె వీడియోలో చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సుధతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవి అనాథ అయ్యాడా? లేదా అతని తల్లిదండ్రులు సుధతో పంపించారో వివరాలు తెలియరాలేదు.