Bihar Man Found guilty of fraud: అతడు సినిమాలో చిన్నప్పుడు పార్థు ఇంటినుంచి వెళ్లిపోతాడు. కొన్నేళ్ల తరువాత మహేష్ బాబు ఆ ఇంటికి తిరిగి రావడంతో అతడే పార్థు అని కుటుంబం హ్యాపీగా ఫీలవుతుంది. కానీ పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అతడు పార్థు కాదని, కుటుంబసభ్యులకు తెలిసిపోతుంది. కానీ ఫ్యామిలీకి ఎంతో మేలు చేశాడు కనుక తన మనవడుగా పెద్దాయని అంగీకరిస్తాడు. తాజాగా బిహార్ రాష్ట్రంలో అతడు సీన్ సన్నివేశం జరిగింది. అతడు సినిమాలో మహేష్ గంటకు పైగా నటిస్తే.. ఇక్కడ ఓ వ్యక్తి ఏకంగా 41 ఏళ్లు ఆ పాత్ర పోషించాడని తెలిసి కుటుంబసభ్యులు, పోలీసులు షాకయ్యారు.


భూస్వామి కుమారుడు మిస్సింగ్.. 
బిహార్‌లోని నలంద జిల్లాలోని ముర్గవాన్ గ్రామానికి చెందిన భూస్వామి కామేశ్వర్ సింగ్​కు ఆరుగురు కుమార్తెలు, కాగా ఒక్కగానొక్క కుమారుడు కన్హయ్య సింగ్ 1977లో తప్పిపోయాడు. ఎగ్జామ్స్ రాసేందుకు స్కూలుకు వెళ్లిన కన్షయ్య ఇంటికి తిరిగిరాలేదు. నాలుగేళ్ల తరువాత పొరుగు గ్రామానికి భర్తారి అనే సాధువు వచ్చాడు. తన పేరు కన్షయ్య అని, తనది ముర్గవాన్ గ్రామమని అందర్నీ నమ్మించాడు. ఇది తెలుసుకున్న కుటుంబసభ్యులు సాధువును ఇంటికి తీసుకెళ్లారు. 1981లో ఇది జరిగింది.


పీఎస్‌కు కుటుంబసభ్యులు.. 
కన్హయ్యకు మొత్తం ఆరుగురు అక్కాచెల్లెళ్లు కాగా, వారు కొత్త వ్యక్తి తమ సోదరుడు కాదని వాదించారు. ఈ మేరకు రామసఖి అనే యువతి అదే ఏడాది సిలావ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ యువకుడు తమ సోదరుడిగా ఇంటికి వచ్చి అందర్నీ మోసం చేస్తున్నాడని, ఆస్తి కోసం నాటకాలు ఆడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ కేసు విచారణ ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూ రావడంతో అతడి అక్కాచెల్లెళ్లు ఐదుగురు కేసు గురించి పట్టించుకోవడం మానేశారు. కానీ రామసఖి అనే మహిళ మాత్రం ఎప్పటికప్పుడూ కేసు దర్యాప్తు వివరాలు తెలుసుకుంటూ పోలీసులకు వివరాలు అందించేది. 


41 ఏళ్ల తరువాత సంచలన తీర్పు.. 
మంగళవారం నాడు బిహార్‌లోని నలంద కోర్టు అసలు నిజాన్ని తేల్చింది. విచారణ చేపట్టిన జస్టిస్ మానవేంద్ర మిశ్రా.. ఇంటికి తిరిగి వచ్చింది ఆ ఇంటి బిడ్డ కాదని.. 41 ఏళ్లుగా కుటుంబాన్ని మోసం చేశాడని స్పష్టం చేశారు. అతడి పేరు కన్హయ్య సింగ్ కాదని, దయానంద్ గోసైన్ అని తేల్చారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 420, 419, 120 కింద అతడ్ని దోషిగా కోర్టు తీర్పిచ్చింది. దయానంద్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. 


అసిస్టెంట్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ రాజేష్ పాఠక్ మాట్లాడుతూ.. కుటుంబసభ్యులు, అతడి మిగతా అయిదుగురు అక్కాచెల్లెళ్లు కేసు గురించి పట్టించుకోవడం మానేసినా.. ఓ సోదరి రామసఖి దేవి మాత్రం తన సోదరుడిగా కొత్త వ్యక్తిని అంగీకరించలేదు. డబ్బు, పేరు కోసం తమ ఇంటికి వచ్చి మోసం చేస్తున్నాడని ఎప్పుడూ వాదించేదని, ఆమె చెప్పిందే నిజమైందని తెలిపారు. ఓ దశలో కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. కానీ కింది కోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేయడంతో కిందికోర్టు విచారణ కొనసాగించింది.


Also Read: Crime News: సెల్‌ఫోన్‌ ఇవ్వడానికి నిరాకరించిన ప్రియురాలు- పోలీసులు వచ్చి ప్రియుడ్ని ఎత్తుకెళ్లారు


Also Read: Kerala News: ప్రాణం తీసిన పోస్ట్ వెడ్డింగ్ షూట్- నదిలో కొట్టుకుపోయిన నవ జంట