జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన దంపతులు హాయిగా జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో ఆమెపై అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెకు తెలియకుండా సెల్ ఫోన్ వీడియో రికార్డ్ ఆన్ చేసి బెడ్రూంలో పెట్టి వెళ్లిపోయాడు. రాత్రికి వచ్చి చూసే సరికి ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండడం చూసి ఇద్దరినీ నిలదీశాడు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోగా.. ఆమె ప్రియుడు మాత్రం తన స్నేహితులను తీసుకొచ్చి మరీ ఇతడిని కిడ్నాప్ చేశారు. ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. అక్కడి నుంచి అతను తప్పించుకొని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వ్చచింది. అసలీ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


అనుమానం వచ్చి బెడ్రూంలో వీడియో రికార్డు ఆన్..


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రాయని రాజు, భార్యను తీసుకొని బతుకుదెరువు కోసం ఏడేళ్ల క్రితం బీరంగూడ న్యూ సాయి భగవాన్ కాలనీకి వచ్చాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ భార్య పద్మజను పోషించుకుంటున్నాడు. వీరి పిల్లలిద్దరూ ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. అయితే గత కొంత కాలం నుంచి రాజుకి తన భార్య పద్మజపై అనుమానం మొదలైంది. ఆమె ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుకుంటున్నాడు. అది నిజమో కాదో తెలుసుకునేందుకు తాను ఆఫీస్ కు వెళ్లే ముందు బెడ్రూంలో వీడియో ఆన్ చేసి సెల్ ఫోట్ పెట్టి వెళ్లిపోయాడు. అయితే అదే రోజు... బీరంగూడ మంజీరానగర్ కాలనీలో ఓలియో చర్చి పాస్టర్ గా పని చేసే రాజు దేవ శిఖామణి ఇంటికి వచ్చాడు. అతడితో రాజు భార్య పద్మజ చనువుగా ఉంది. సెల్ ఫోన్ లో వీరిద్దరికి సంబంధించిన వీడియో రికార్డు అయింది. 


రాజుని కిడ్నాప్ చేసిన దేవ శిఖామణి..


ఇంటికి వచ్చిన అనంతరం రాజు ఫోన్ ను తీసి చెక్ చేశాడు. అందులో తన భార్య, దేవ శిఖామణితో కలిసి ఉండటాన్ని చూసి నిలదీశాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో పద్మజ మంగళగిరిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయంపై రాజు దేవ శిఖామణిని నిలదీశాడు. దీంతో అతడు రాజుపై కోపం పెంచుకున్నాడు. తన స్నేహితులు కిరణ్ గౌడ్, కుంటోల్ల మల్లేశ్, సాయి, దినేశ్, వీరప్పను వెంట బెట్టుకొని వచ్చి రాజుని కిడ్నాప్ చేశాడు. ఈనెల 13వ తేదీన బలవంతంగా కారులో ఎక్కించుకొని ఇసుక బావి వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి రాంచంద్రాపురంలోని అస్లంఖాన్ కు చెందిన శ్రీ సాయి ఫొటో స్టూడియోలో నిర్బంధించారు. కట్టెలతో కొట్టి రాజు తీసిన వీడియోలను తొలగించారు. రాత్రంతా రాజు అక్కడే ఉంచారు. అయితే నిందితుల కళ్లు గప్పి రాజు అక్కడి నుంచి తప్పించుకొని స్వగ్రామానికి వెళ్లాడు. 26వ తేదీ సాయంత్రం అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు..


కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ సుభాష్.. నిందితులు శిఖామణి, కిరణ్ గౌడ్, మల్లేశ్ గౌడ్, అస్లంఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. సాయి, దినేశ్, పర్మప్ప పరారీలో ఉన్నారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి కారు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నలుగురిపై 120(బి), 386, 46, 363, 324, 442, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే దేవ శిఖామణి భార్య అమీన్ పూర్ కోఆప్షన్ సభ్యురాలు. దేవ శిఖామణి కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందినవాడే. అతడి అరెస్ట్ గురించి తెలుసుకున్న మండల పార్టీ నేతలు.. దేవ శిఖామణిని పార్టీ నుంచి తొలగించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ విషయాన్ని వెల్లడించారు.