Telugu News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ బాలిక తలలో పెన్ను గుచ్చుకోవడంతో మరణించింది. భద్రాచలంలో ఈ ఘటన జరిగింది. స్థానిక సుభాష్ నగర్లో నివాసం ఉంటున్న బాలిక మంచంపై ఆడుకుంటూ కిందపడింది. దాంతో కింద ఉన్న పెన్ను గుచ్చుకుందని స్థానికులు తెలిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది.


సుభాష్‌ నగర్ లో ఉంటున్న రియాన్షిక అనే 5 ఏళ్ల చిన్నారి తలలో పెన్ను గుచ్చుకోవడంతో దుర్మరణం చెందిందని పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పాప మంచంపై కూర్చొని రాసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు బాలిక కిందపడింది. మంచం పక్కనే ఉన్న ఓ పెన్ను చిన్నారి కణితి వద్ద తలలోకి దిగింది. దీన్ని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే బాలికను భద్రాచలంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ రియాన్షికకు మెరుగైన వైద్యం అందకపోవడంతో.. డాక్టర్లు సూచన మేరకు ఖమ్మం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స జరుగుతుండగా చిన్నారి చనిపోయింది. బాలిక రియాన్షిక అకాల దుర్మరణంతో వారి కుటుంబంలో తీవ్రమైన విషాదం నెలకొంది. భద్రాచలం పట్టణంలో జరిగిన ఈ విషాద ఘటన అందరిని కలిసి వేసింది.