Anusha Sharath Bengaluru Crime:  సోషల్ మీడియా పరిచయాలు, క్షణికావేశాలు యువత జీవితాలను ఎలా బలితీసుకుంటున్నాయో చెప్పడానికి బెంగళూరులో జరిగిన ఈ ఘోరమే ఒక నిదర్శనం. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ఓ ప్రేమకథ, సహజీవనం  వరకు వెళ్లి.. చివరకు మల్లేశ్వరం ఏరియాలోని ఒక అద్దె ఇంట్లో అత్యంత దారుణమైన హత్యతో ముగిసింది. కేవలం 20 ఏళ్ల వయసున్న అనుష అనే యువతిని, ఆమెతో కలిసి ఉంటున్న శరత్ అనే యువకుడు గొంతు నులిమి చంపేశాడు.  

Continues below advertisement

రీల్స్ పరిచయం.. రియల్ లైఫ్ మర్డర్ 

కర్ణాటకలోని హాసన్ జిల్లా సకలేశపురానికి చెందిన అనుష, శరత్ లకు దాదాపు ఏడాది క్రితం  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్  ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కామెంట్లు, చాటింగ్‌లతో ప్రేమికులుగా మార్చింది. ఒకరినొకరు విడిచి ఉండలేమనుకున్న ఈ జంట, పెద్దలను ఎదిరించి బెంగళూరుకు చేరింది. మల్లేశ్వరం 7వ క్రాస్ ఏరియాలోని ఒక బెడ్‌రూమ్ ఉన్న ఇంట్లో గత ఆరు నెలలుగా ఈ జంట సహజీవనం సాగిస్తోంది. శరత్ నగరంలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు.

Continues below advertisement

 ఆల్కహాల్ మత్తులో ఆ రాత్రి ఏం జరిగింది? 

మల్లేశ్వరంలోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘాతుకం జూన్ 14  రాత్రి  జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రాత్రి ఇద్దరూ కలిసి గదిలో మద్యం సేవించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య కొన్ని వ్యక్తిగత విషయాలపై తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. చిన్న విషయానికే మొదలైన గొడవ కాస్తా పెద్దదైంది. మద్యం మత్తులో ఉన్న శరత్ విచక్షణ కోల్పోయి, క్షణికావేశంలో అనుషపై దాడి చేసి, ఆమె గొంతును గట్టిగా నులిమి ఊపిరాడకుండా చేసి కిచెన్ ఫ్లోర్‌పైనే ప్రాణాలు తీశాడు.

 లాయర్‌కు ఫోన్ కాల్.. హత్య బయటపడిందిలా! 

అనుష చనిపోయిందని నిర్ధారించుకున్న శరత్ భయంతో వణికిపోయాడు. శవాన్ని గదిలోనే వదిలేసి, ఇంటికి తాళం వేసి కీని కిటికీ పక్కన దాచి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, చట్టం నుండి తప్పించుకోలేనని భావించిన శరత్.. సోమవారం ఒక ప్రముఖ న్యాయవాది కి ఫోన్ చేసి, తాను చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నాడు. లాయర్ సలహా కోరగా, ఆ లాయర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే శేషాద్రిపురం పోలీసులకు సమాచారం అందించాడు. లాయర్ ఇచ్చిన అడ్రస్ ఆధారంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

  కిచెన్ ఫ్లోర్‌పై శవం.. యజమాని స్టేట్‌మెంట్ 

పోలీసులు తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి అనుష మృతదేహం వంటగది ఫ్లోర్‌పై పడి ఉంది. కాగా, ఇంటి యజమాని రమేష్ బాబు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. ఈ జంట నిరంతరం చిన్న చిన్న కారణాలకే ఇంట్లో గొడవ పడుతూ ఉండేదని, చుట్టుపక్కల వారు కూడా చాలాసార్లు వారిని మందలించారని తెలిపారు. ఈ నిరంతర గృహ కలహాలే చివరకు హత్యకు దారితీశాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

 హంతకుడు అరెస్ట్.. దర్యాప్తు ముమ్మరం 

పోలీసులు నిందితుడు శరత్ కోసం గాలింపు చర్యలు చేపట్టి, 24 గంటల్లోనే అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. అనుష మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మల్లేశ్వరంలోని కేసీ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని సకలేశపురంలోని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఇన్‌స్టాగ్రామ్ పరిచయాలు, గుడ్డి నమ్మకాలతో ఇల్లు వదిలి వచ్చే యువతులు ఎలా మోసపోతున్నారో, ఎలాంటి ప్రమాదాల్లో పడుతున్నారో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోందని బెంగళూరు పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.