ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రైవేటు బస్సులో భారీ చోరీ జరిగింది. రెండు కిలోల బంగారు ఆభరణాలతో ఉన్న ఓ బ్యాగు అపహరణకు గురైంది. గాఢ నిద్రలో నుంచి మేల్కొన్న బాధితుడు తన బ్యాగు కనిపించకపోయేసరికి ఒక్కసారిగా కంగుతిన్నాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ముంబయికి చెందిన యజమాని తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సైఫాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 


ముంబయిలోని ఫ్యాక్టరీల్లో తయారయ్యే బంగారు ఆభరణాలను షోరూంలకు ఓ వ్యక్తి సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణిస్తుండగా అతడి వద్ద ఉన్న రెండు కిలోలకు పైగా నగల బ్యాగు మాయమైంది. ముంబయికి చెందిన రనూజా జువెలర్స్‌ దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న జువెలరీ దుకాణాలకు తయారు చేసిన ఆభరణాలను సరఫరా చేస్తుంటుంది. ఆ కంపెనీలో పనిచేసే గులాబ్‌ మాలిక్‌ అనే 32 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌లోని పలు నగల దుకాణాలకు చేర వేసేందుకు ఆభరణాలను తీసుకొని జబ్బార్‌ ట్రావెల్స్‌ బస్సు ఎక్కాడు. ఈ నెల 23న ముంబయి నుంచి 24న హైదరాబాద్‌కు చేరుకున్నాడు. నగరానికి వచ్చిన అనంతరం అమీర్‌పేటలో నిద్రలేచిన అతడు చూసుకోగా నగల బ్యాగు మాయమై ఉంది. 


Also Read: Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి అంత మాట అనేశారే.. రేవంత్‌ రెడ్డిపై అసంతృప్తే కారణమా?


బ్యాగులో 2.12 కిలోల బంగారు ఆభరణాలు ఉండడంతో అతనికి నోట మాట రాలేదు. డ్రైవర్‌ను, ఇతరులను విచారణ జరిపినా ఫలితం లేకపోవడంతో లక్డీకాపూల్‌లో బస్సు దిగి జరిగిన విషయాన్ని యజమానికి తెలియజేశాడు. యజమాని శ్రవణ్‌ గెహ్లోత్ ముంబయి నుంచి నగరానికి వచ్చి సైఫాబాద్‌ పోలీ‌స్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక్కడ జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు అమీర్‌పేటలో అతడు బ్యాగు లేదన్న విషయం గుర్తించినందున కేసు ఆ పరిధిలోకి వస్తుందని కేసును పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. బస్సులో ప్రయాణించిన వారి వివరాలను పోలీసులు సేకరించి వారి ద్వారా విచారణ జరుపుతున్నారు. అన్ని కోణాల్లోనూ విచారించనున్నట్లు పోలీసులు వివరించారు.


Also Read: High Court News: భార్యతో అలా శృంగారం చేస్తే రేప్‌గా పరిగణించలేం.. ఛత్తీస్ గఢ్ హైకోర్టు తీర్పు


Also Read: Gold-Silver Price: బంగారం కొనాలా? తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేడు మీ నగరంలో ఇలా..