Asifabad Boy Death Battery Blast:  సాంకేతిక పరిజ్ఞానం రోజువారీ జీవితంలో భాగమైన వేళ.. చిన్న నిర్లక్ష్యం ఎంతటి ఘోర దారుణానికి దారితీస్తుందో నిరూపించే భీతిగొలిపే ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. చెడిపోయిన సెల్ఫోన్ బ్యాటరీని పంటితో కొరకడంతో అది నోట్లోనే పేలిపోయింది.   యువకుడు అత్యంత దారుణమైన రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే జరిగిన ఈ హృదయవిదారక ఘటనతో సదరు గ్రామం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

Continues below advertisement

 చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామానికి చెందిన నికాడి లోకేష్  అనే యువకుడు ఇంట్లో ఉన్న సమయంలో తన సెల్ఫోన్ బ్యాటరీ సరిగ్గా పనిచేయకపోవడాన్ని గమనించాడు. బ్యాటరీని బాగుచేసే క్రమంలోనో లేదా సరిగా ఉందో లేదో అని పరిశీలించే క్రమంలోనో నోటితో దానిని కొరికాడు. అయితే ఊహించని రీతిలో ఆ ప్రెజర్‌కు బ్యాటరీలో ఉన్న లిథియం కెమికల్స్ ఒక్కసారిగా రసాయన చర్యకు గురై తీవ్ర తీవ్రతతో పేలిపోయాయి.

ఈ విస్ఫోటన దాటికి జరిగిన నష్టం చూసి చుట్టుపక్కల వారు భయంతో వణికిపోయారు. బ్యాటరీ నోట్లోనే పేలడంతో లోకేష్ నోరు, ముఖం, గొంతు భాగాలు తీవ్రంగా ఛిద్రమైపోయాయి. విపరీతమైన రక్తస్రావం కావడం, అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో సదరు యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు.   కళ్లెదుటే రక్తసిక్తమై పడి ఉన్న కుమారుడి మృతదేహాన్ని చూసి కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

Continues below advertisement

ఘటనపై సమాచారం అందుకున్న చింతలమానేపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సెల్ఫోన్లు, వాటి బ్యాటరీల విషయంలో అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలకే ప్రమాదమని, ఎట్టిపరిస్థితుల్లోనూ బ్యాటరీలను కొరకడం, వేడి చేయడం లేదా పిన్నులతో గుచ్చడం వంటి పనులు చేయకూడదని పోలీసులు , నిపుణులు ఈ సందర్భంగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.