AR Constable Forceful Death In Mahabubabad: మహబూబాబాద్‌లో (Mahabubabad) ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తోన్న ఓ కానిస్టేబుల్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ గుండెబోయిన శ్రీనివాస్ కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ట్రెజరీ స్ట్రాంగ్ రూం వద్ద విధుల్లో ఉండగా ఒక్కసారిగా తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్ గన్‌తో తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుపాకీ పేలుడు శబ్దం ఉన్న సహోద్యోగులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ సుధీర్ రాంనాధ్ మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


సెల్ఫీ వీడియో తీసుకుని..


మరోవైపు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగర్ అనే కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏనుకూరుకు చెందిన సాగర్ బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేశాడు. 8 నెలల క్రితం గంజాయి కేసులో సాగర్‌ను పోలీస్ అధికారులు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. చేయని నేరానికి తనకు శిక్ష పడిందని సాగర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పటి ఎస్సై బదిలీ అయిన తర్వాత ఎస్ఐగా వచ్చిన వారు వివిధ కేసుల్లో పట్టుకున్న గంజాయిని అమ్ముకుని తనను బలిపశువుని చేశారని సాగర్ సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


నీటిలో మునిగి అన్నదమ్ములు


అటు, నీటి గుంతలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట మండలం స్ఫూర్తితండాకు చెందిన సక్రూనాయక్, జ్యోతికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. శనివారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్దకు వీరి కుమారులు సాయినాయక్ (13), సాకేత్ నాయక్ (9) వెళ్లారు. వీరిద్దరూ ఎంతకూ తిరిగి రాకపోవడంతో సక్రూనాయక్ పొలం వద్ద వెతికాడు. మార్గమధ్యలో ఉన్న గుంత వద్ద అనుమానం వచ్చి చూడగా ఇద్దరు కుమారులు మునిగిపోయి కనిపించారు. స్థానికుల సాయంతో వారిని బయటకు తీసి జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదివారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Also Read: Crime News: తెలంగాణలో తీవ్ర విషాదం - ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి తండ్రి ఆత్మహత్య