వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితునిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. ఎర్ర గంగిరెడ్డి, ఆయన అనుచరులు సాక్షులను తీవ్రంగా బెదిరిస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. గంగిరెడ్డి బయటుంటే దర్యాప్తునకు విఘాతం కలుగుతోందని, బెయిలు రద్దు చేయాలని కోరారు.  ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ షరతులు ఉల్లంఘించాడా? సాక్షులను బెదిరించాడా? అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని కోర్టు ముందు ఉంచాలని సీబీఐని ఆదేశించింది. విచారణలో తమను బెదిరిస్తున్నారని సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ హైకోర్టుకు సమర్పించింది. అయితే సీబీఐ వాదనను హైకోర్టు తిరస్కరించింది. సాక్షులను బెదిరించారన్నదానికి ఆధారాలు లేవని.. సీబీఐ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ కొనసాగనుంది.


మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమైనన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి ఉన్నారు.  తాజాగా వివేకానంద డ్రైవర్‌ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన వైఎస్ వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితునిగా ఉండేవారు.అయితే ఆర్థిక లావాదేవీలతో పాటు రాజకీయ కారణాలతో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో కుమ్మక్కయి  కుట్రకు పాల్పడ్డారని సీబీఐ చెబుతోంది. ఎర్రగంగిరెడ్డిని మార్చి 28,2019న పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్ష్యాలు తుడిచివేశారన్న కారణంగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పులివెందుల జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు 2019, జూన్‌లో బెయిల్ మంజూరు చేసింది. విచారణలో ఎర్ర గంగిరెడ్డి కీలక పాత్రధారిగా తేలడంతో డీఫాల్ట్‌ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ ముందుగా కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అక్కడ సానుకూల నిర్ణయం రాకపోవడంతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అక్కడా సీబీఐకి ఎదురు దెబ్బ తగిలింది. 


వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చివరికి వచ్చింది ఎప్పుడైనా తుది చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసు రాజకీయంగా హై ప్రోఫైల్ కేసు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో వైఎస్ఆర్‌సీపీ పూర్తిగా అవినాష్ రెడ్డికి మద్దతుగా ఉంటూండటంతో... ఈ కేసు మొత్తం రాజకీయం అయిపోయింది. దీంతో సీబీఐ తదుపరి ఎలాంటి అడుగులు వేస్తుందన్నదానిపై అంతటా ఆసక్తి ఏర్పిడింది.