Anantapuram News: తెలిసిన వ్యక్తి వాహనం కొనుక్కుంటాను.. పైనాన్స్ ఇప్పించమంటే సరేనన్నాడు. మధ్యవర్తిత్వం వహించి లోన్ ఇప్పించాడు. సదరు వ్యక్తి వాహనం కొనుక్కున్నాడు. కానీ ఆ తర్వాత నుంచి నెలా నెలా కట్టాల్సిన డబ్బులను కట్టలేదు. దీంతో ఫైనాన్స్ కంపెనీ వాళ్లు మధ్యవర్తిని పట్టుకున్నారు. ఇంటికి వచ్చి గొడవ చేయడం ప్రారంభించారు. అతడి ద్విచక్రవాహనాన్ని కూడా తీసుకెళ్లిపోయారు. దీంతో వారి వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 


అసలేం జరిగిందంటే..?


అనంతపురం జిల్లా ఉమానగర్ లో నివాసం ఉంటున్న బలరాం, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తెకు గతంలోనే వివాహం అయింది. వీరి కుమారుడు 26 ఏళ్ల కృష్ణ ప్రభుత్వాసుపత్రిలో పెస్ట్ కంట్రోలర్ గా పని చేస్తున్నాడు. ఉమానగర్ లోనే నివసిస్తున్న కేశవనాయుడు అనే వ్యక్తి వీరి కుటుంబానికి దగ్గర అయ్యాడు. కృష్ణ అతడిని ఆప్యాయంగా చిన్నాన్న అని పిలిచేవాడు. అయితే కొంతకాలం క్రితం కేశవనాయుడు తనకు ఫైనాన్స్ లో గూడ్స్ వెహికల్ ఇప్పించమని.. కృష్ణను కోరాడు. దీంతో తెలిసిన వాడు కావడంతో కృష్ణ కూడా అందుకు ఓకే చెప్పాడు. శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ లో బొలేరో వాహనాన్ని ఇప్పించాడు.


కేశవనాయుడు నెలానెలా కట్టాల్సిన వాయిదా డబ్బులను సకాలంలో చెల్లించలేకపోయాడు. దీంతో ఫైనాన్స్ కంపెనీ వారు కృష్ణను వేధించడం ప్రారంభించారు. పలుమార్లు ఇంటి వద్దకు వెళ్లి గొడవ చేశారు. కృష్ణ కుటుంబ సభ్యులతో అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాకుండా అతడి ద్విచక్రవాహనాన్ని కూడా లాక్కెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం మరోసారి ఇంటికి వచ్చి గొడవకు దిగారు. ఇలా చేయడం బాగాలేదని కృష్ణ ఆవేదన వ్యక్తం చేయగా.. నోటీసు అందజేసి నిన్ను కోర్టుకు లాగి ఆస్తి జప్తు చేయిస్తామంటూ హెచ్చరించారు. 


గదిలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న కృష్ణ


 దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కృష్ణ.. ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు. ఇంట్లోని తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అయితే బాధలో ఉన్నాడు కదా, ఇబ్బంది పెట్టడం ఎందుకని కుటుంబ సభ్యులు కూడా కృష్ణను పలకరించలేదు. కానీ లోపకిలి వెళ్లి గడియ వేసుకున్న కృష్ణ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రోజు ఉదయం కుమారుడిని నిద్ర లేపేందుకు వెళ్లిన తల్లి.. ఫ్యానుకు వేలాడుతున్న కృష్ణను చూసి గట్టిగా కేకలు వేసింది. షాకై అక్కడికక్కడే కుప్పకూలింది. ఏం జరిగిందో అర్థం గాక పరుగుపరుగున వచ్చి చూసిన తండ్రి గుండెలు బాధుకుంటూ రోదించాడు. 


విషయం గుర్తించిన స్థానికులు అక్కడకు చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. అలాగే కృష్ణను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. చేతికి అందివచ్చిన కుమారుడు ఇలా మంచితనానికి పోయి ప్రాణాలు తీసుకోవడం తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం కృష్ణ మృతదేహాన్ని అదే ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమారుడి చావుకు కారణం అయిన కేశవనాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కృష్ణ తండ్రి పోలీసులను కోరాడు.