Man Murder: అనంతపురం జిల్లాలో 13 ఎకరాల భూమి కోసం సొంత బావ మరిదినే చంపాడో బావ. సెల్ ఫోన్ ఇప్పిస్తా రమ్మని చెప్పి వెంట తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మచ్చ కొడవలితో అత్యంత దారుణంగా గొంతు కోశాడు. జిల్లాలోని కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన 9వ తరగతి చదివే విద్యార్థి దండా అఖిల్(15) మే 22న కందూరు పోలీస్ స్టేషన్ లో అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు. అయితే దండా అఖిల్ హత్యకు సూత్రధారి, పాత్రధారి సొంత బావ అనిల్ యే అని పోలీసులు గుర్తించారు. 


అత్తింటి వాళ్ల 13 ఎకరాల భూమిపై అనిల్ కన్ను..


ములకనూరు గ్రామానికి చెందిన శారదమ్మ, హనుమంత రాయుడులకు దంపతులకు ముగ్గురు పిల్లలు. వాళ్లే దండా అఖిల్, వర్షిత, త్రిషలు. 8 నెలల క్రితం పెద్ద కూతురు వర్షితను పక్క గ్రామమైన గుద్దేళ్ల గ్రామానికి చెందిన బారపనీడి అనిల్ కు ఇచ్చి వివాహం చేశారు. కొన్ని నెలల పాటు అనిల్ కుటుంబంతో సంతోషంగానే ఉన్నాడు. అయితే అత్తింటి వాళ్లకు ఆస్తి ఎక్కువగా ఉంది. 13 ఎకరాల భూమి ఉండటంతో... అల్లుడు అనిల్ కన్ను అత్తింటి ఆస్తిపై పడింది. అయితే బావ మరిదిని అనిల్ ను అడ్డు తొలగించుకుంటే ఆ ఆస్తి అంతా తనకే దక్కుతుందనుకున్నాడు. ఈ క్రమంలోనే బావ మరిదిని చంపాలని నిర్ణయించుకున్నాడు. 


పరారైన అఖిల్ ను పట్టుకున్న పోలీసులు..


ఈ క్రమంలోనే బావ మరిదిని చంపేందుకు పథకం వేశాడు. మే 21వ తేదీన ములకనూరులో తిమ్మప్ప స్వామి జాతర జరుగుతుండగా అఖిల్ అదృశ్యమయ్యాడు. మరుసటి రోజ తల్లిదండ్రులు కందూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతకీ దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులందిరినీ విచారించారు. ఈ క్రమంలోనే అనిల్ పై పోలీసులకు అనుమానం వచ్చింది. అది గ్రహించిన అతడు తప్పించుకొని పరారయ్యాడు. అయినప్పటికీ పోలీసులు వెంటపడి మరీ అతడిని పట్టుకున్నారు. చివరకు నిజం కక్కించారు. 


సెల్ ఫోన్ ఇప్పిస్తానని తీసుకెళ్లి.. మచ్చు కొడవలితో నరికి!


అత్తగారికి ఉన్న 13 ఎకరాల భూమి కోసమే తన బావ మరిదికి అఖిల్ కు సెల్ ఫోన్ ఇప్పిస్తానని చెప్పి తన బైక్ లో గుద్దేళ్లలోని తన వ్యవసాయ తోటలోకి తీసుకువెళ్లి చంపేసినట్లు అనిల్ నిజం ఒప్పుకున్నాడు. ముందుగా వేరుశనగ పంటలోకి తీసుకెళ్లి అఖిల్ కాళ్లు, చేతులను వైరుతో కట్టేశానని.. ఆపై మచ్చు కొడవలితో నరికేసినట్లు వివరించాడు. ఆ తర్వాత ముందుగానే తీసి ఉంచిన గుంతలో పడేసి మట్టి, రాళ్లతో కప్పేసినట్లు చెప్పాడు. నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి ఆ గుంత తవ్వి చుడగా.. అఖిల్ మృతదేహం లభ్యం అయింది. అప్పటికే ఆ శవం అంతా పాడైపోయింది. పోలీసులు రెవిన్యూ అధికారుల సమక్షంలో పోస్టు మార్టం నిర్వహించి.. నిందితుడైన బావ అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు.