Anakapalli News : అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మనస్తాపంతో సచివాలయ ఉద్యోగి గొర్లె వరుణ్‌కుమార్‌(31) ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వరుణ్‌కుమార్‌ దేవరాపల్లిలోని తన ఇంట్లో శనివారం ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 


అసలేం జరిగింది? 


అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లికి చెందిన గొర్లె వరుణ్‌ కుమార్‌ వేచలం గ్రామ సచివాలయంలో జూనియర్‌ లైన్‌మేన్‌గా పనిచేస్తున్నారు. వరుణ్ కుమార్ కు వివాహం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అందుకు తల్లి పైడితల్లమ్మ, బంధువులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కొంతకాలం పెళ్లి సంబంధాలు చూడొద్దని వరుణ్‌ కుమార్‌ తల్లిని వారించాడు. అయినా కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో మనస్తాపం చెందిన వరుణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం స్నానం చేసి వస్తానని చెప్పి ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. ఎంతసేపటికీ వరుణ్ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్‌ చేశారు. ఎంతసేపటికీ అతను ఫోన్‌ తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి ఉరి వేసుకుని వరుణ్ ఆత్మహత్య పాల్పడ్డాడు. వరుణ్ బతికి ఉన్నాడేమో పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయింది. మృతుడి తల్లి పైడితల్లమ్మ ఫిర్యాదుతో సీఐ తాతారావు, ఎ.కోడూరు ఎస్‌ఐ లోకేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వరుణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు.  


గంటలో పెళ్లి... ఇంతలో పెళ్లి కూతురు ఆత్మహత్య


ఆమె పుట్టినప్పటి నుంచి అపురూపంగా చూసుకున్నారు. ఓ అయ్య చేతిలో పెట్టి తమ బాధ్యత తీర్చుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయిని చూశారు. అతడితో ఆమెకు పెళ్లి నిశ్చయించారు. నిశ్చితార్థం కూడా చేశారు. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. పెళ్లికి వంటల దగ్గర నుంచి అమ్మాయికి ఇచ్చే కట్నకానుల వరకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. పచ్చని పందిరి మధ్య బంధువులు, మిత్రులు తెగ సందడి చేశారు. తమ కూతురు పెళ్లని తెగ మురిసిపోయారు. కానీ వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


అసలేం జరిగిందంటే..? 


పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రానికి చెందిన ర్యాగల రవళిని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సంతోశ్​ కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అమ్మాయి, అబ్బాయిలు అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. పెళ్లి తర్వాత జీవితం చాలా బాగుంటుందని భావించిన ఆ అమ్మాయికి.. అతడిపై అనుమానం మొదలైంది. అతడు మాట్లాడే మాటలు చూస్తుంటే తనను బాగా చూసుకోలేడనే భావన కలిగింది. కానీ తన పెళ్లి అని సంతోషంగా ఉన్న ఆ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడతారో అని తన మనసులోనే దాచుకుంది. పైకి నవ్వుతూ, పెళ్లి ఏర్పాట్లలో పాల్గొంటూనే లోలోపల మదనపడుతోంది. అయితే ఆదివారం నిజామాబాద్​లో మధ్యాహ్నం 12:15 గంటలకు వివాహం జరిపేందుకు తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ అతనితో కలిసి అస్సలే జీవించలేనని భావించిన ఆ అమ్మాయికి ఏం చేయాలో పాలుపోలేదు. పెళ్లికి ముందే ప్రాణం తీసుకుంటే తన వల్ల కుటుంబ సభ్యుల పరువు పోదని, తనకు బాధతప్పుతుందని భావించింది. ఇంట్లో అందరూ చుట్టాలు ఉండగానే.. ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.