5 Lakh Bribe ACB Trap Anakapalle: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా గనుల శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ  అధికారులు గురువారం సంచలన దాడి నిర్వహించారు. క్వారీ లీజు దరఖాస్తును ప్రాసెస్ చేసి అనుమతులు మంజూరు చేయడానికి ఓ బాధితుడి నుంచి ఏకంగా రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి తావులేకుండా పారదర్శక పరిపాలన అందించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ, క్రింది స్థాయి అధికారుల అక్రమార్జన వేధింపులు కొనసాగుతుండటానికి ఈ ఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.                 

Continues below advertisement

ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్.ఎస్. రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలోని సర్వే నంబర్ 211లో గల 2 హెక్టార్ల క్వారీ లీజు కోసం తుమ్మపాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గనుల శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. సదరు దరఖాస్తుకు సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేసి అప్రూవల్ ఇప్పించేందుకు సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ మొత్తం రూ. 15 లక్షలు లంచంగా డిమాండ్ చేశారు. అధిక మొత్తంలో లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఈ నెల 4వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. 

బాధితుడి ఫిర్యాదును ప్రాథమికంగా విచారించి నిజమని నిర్ధారించుకున్న ఏసీబీ బృందం పక్కా వ్యూహంతో ఉచ్చు బిగించింది. గురువారం నాడు అనకాపల్లి మైన్స్ కార్యాలయంలో సర్వేయర్ మురళీకృష్ణ అడ్వాన్స్‌గా రూ. 5 లక్షల లంచం సొమ్ము తీసుకుంటుండగా, ఏసీబీ అదనపు ఎస్పీ ఎస్.ఆర్. హర్షిత , డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని బృందం ఆకస్మికంగా దాడి చేసి ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిందితుడి వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని, రసాయన పరీక్షల ద్వారా ఆధారాలను సేకరించారు.             

Continues below advertisement

అవినీతికి అలవాటుపడిన ఈ సర్వేయర్ ఏసీబీకి పట్టుబడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో 2018లో విశాఖపట్నం మైన్స్ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలోనే రూ. 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆ కేసు ఇంకా న్యాయస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, అనకాపల్లి కార్యాలయంలో పోస్టింగ్ పొంది మళ్లీ అదే తరహాలో భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేస్తూ రెండోసారి ఏసీబీకి దొరికిపోవడం స్థానికంగా ,  శాఖాపరంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.                                         

ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అధికారి అయినా పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. కాగా, ఏసీబీకి పట్టుబడిన సర్వేయర్‌పై కేసు నమోదు చేసి, అనకాపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడితో జిల్లాలోని పలు శాఖల అధికారుల్లో కలకలం రేగింది.