పెళ్లంటే మూడు ముళ్లు.. ఏడు అడుగులు ... విందు భోజనాలు.. బంధువుల సందడి మాత్రమే కాదు. ఆ పెళ్లితో జంటగా మారుతున్న యువతీయువకుల్లో కనిపించని సంఘర్షణ కూడా. కొత్త జీవితం అంటే ఎన్నో ఆశలుంటాయి.. అనుమానాలు ఉంటాయి. తాము తట్టుకోగలమా అనే ఆందోళనా ఉంటుంది. అన్నింటినీ అధిగమించడమే అసలైన జీవితం. కొంత మంది అర్థం చేసుకుంటారు.. కానీ కొంత మంది మాత్రం పిరికిగా మారిపోతూంటారు. చివరి క్షణంలో ఎందుకు ఈ జీవితం అనుకుని ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి అయిన వారానికే వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఫస్ట్ నైట్ కాకుండానే ప్రాణం తీసుకున్నారు. ఈ ఫస్ట్ నైట్‌పై పెట్టుకున్న  భయాలు.. పెంచుకున్న అపోహలే ఆత్మహత్యకు కారణం అని భావిస్తున్నారు. 


తెనాలి చెంచుపేట‌కు చెందిన 25 ఏళ్ల యువ‌తికి మాచర్లకు చెందిన కిరణ్ కుమార్ అనే యువకుడికి ఈ నెల 11న వివాహం జరిగింది.  వివాహ‌మైన మ‌రునాడు అంటే ఈ నెల  12వ తదీన వధువును తీసుకొని వరుడు మాచర్లకు వెళ్ళాడు. నాలుగు రోజుల తర్వాత 16వ తేదీన తెనాలిలో తొలి రాత్రి కార్యానికి భార్యను తీసుకొని మాచర్ల నుంచి తెనాలికి బయలుదేరాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గుంటూరు బస్టాండుకు రాగానే టాయిలెట్‌కు వెళ్లి ఇప్పుడే వస్తానని భార్య‌కు చెప్పి కనబడకుండా వెళ్లిపోయాడు. రాత్రి వరకు ఎదురు చూసిన నూతన వధువు తన బంధువులకు సమాచారమిచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో చేసేది లేక, చీకటి పడుతుందని వారు తెనాలి వ‌చ్చేశారు. 


కృష్ణా నది ఎగువన ఓ గుర్తు తెలియని మృతదేహం ఉందిని తాడేప‌ల్లి పోలీసులకు సమాచారం రావడంతో వారు శవాన్ని వెలికి తీశారు. జేబులో ఉన్న ఫోన్ సిమ్ తీసి బంధువులకు సమాచారమందించారు. మృతుడి తల్లి ఆ మృతదేహం తన బిడ్డ కిరణ్‌దేనని గుర్తించింది. కిరణ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడానికి మొదటి రాత్రి భయమేనని బంధువులు చెబుతున్నారు.  మొదటి రాత్రి అంటే తన కొడుకు భయపడ్డాడని, స్నేహితులు ఎంత ధైర్యం చెప్పినా ఆత్మహత్య చేసుకున్నాడని కిరణ్ కుమార్ తల్లి రోదిస్తున్నారు. కాళ్ల పారాణి కూడా ఆర‌క ముందే భ‌ర్త దూర‌మ‌వ‌డంతో తెనాలిలోని త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు ఉన్న ఆ న‌వ వ‌ధువు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తోంది.


లైంగిక విషయాల పట్ల అవగాహన లేకపోవడం ... సోషల్ మీడియాలో జరిగే అనేక రకాల ప్రచారాలను నమ్మడం వల్ల యువత ఎక్కువగా మానసిక ఆందోళనలకు గురవుతూ ఉంటారు. తాము అనుకున్నదే నిజం అని అనుకుంటూ ఉంటారు. ఇతరులు చెప్పినా నమ్మరు. ఇలాంటివారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తే కొన్ని ప్రాణాలను కాపాడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.