నెల్లూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో హోం వర్క్ బుక్ తేలేదని నెల్లూరులో ఓ టీచర్ విద్యార్థిని కర్రతో కొట్టింది. పొరపాటున అది కంటిదగ్గర తగలడంతో విద్యార్థికి గాయమైంది. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ పిల్లవాడిని టీచర్ గాయపరిచిందని కేసు పెట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టీచర్ పై కేసు నమోదు చేశారు నవాబుపేట ఎస్సై తిరుపతయ్య.


అసలేం జరిగింది..?


నవాబుపేట కుమ్మర వీధికి చెందిన ప్రవీణ్ కుమార్, ఆశ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు ఆకాంక్ష్. స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్ లో నాలుగో తరగతి చదవుతున్నాడు. ఇటీవల ఆకాంక్ష్ స్కూల్ కి వెళ్లేటప్పుడు హోం వర్క్ చేసిన పుస్తకం ఇంటి వద్దే మరచిపోయి వెళ్లాడు. స్కూల్ లో టీచర్ హోం వర్క్ చేశారా అని అడిగింది. చేశామని చెప్పిన ఆకాంక్ష్ పుస్తకం మరచిపోయానని అన్నాడు. దీంతో టీచర్ కి కోపం వచ్చింది. కర్రతో రెండు దెబ్బలు కొట్టింది. పొరపాటున ఆ దెబ్బ కంటి వద్ద తగలడంతో ఆకాంక్ష్ కి గాయమైంది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు ఆకాంక్ష్ ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదం లేదని చెప్పారు వైద్యులు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఆ విషయాన్ని అక్కడితో వదిలిపెట్టలేదు. క్రమశిక్షణ పేరుతో తమ పిల్లవాడిని కొట్టినందుకు టీచర్ పై నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవాబుపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. నవాబుపేట ఎస్సై తిరుపతయ్య ఆకాంక్ష్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీచర్ పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టినట్టు తదెలిపారు.


స్కూల్ లో పిల్లలను మందలించడంలో తప్పులేదు. కానీ కొన్నిసార్లు పొరపాటునో, గ్రహపాటునో మందలింపు శృతి మించుతుంది. లేదా విద్యార్థికి బలమైన గాయమవుతుంది. అలాంటి సందర్భాల్లో టీచర్లు అనుకోకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. విద్యార్థి మేలు కోసమే టీచర్ ఇక్కడ అతడిని మందలించింది. అయితే పొరపాటున కంటి వద్ద గాయం కావడంతో విషయం పెద్దదైంది. అయితే తల్లిదండ్రులు ఈ విషయంలో రాజీ పడలేదు. నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. దీంతో పోలీసులు టీచర్ పై కేసు పెట్టారు.


అయితే ఆ విద్యార్థిని తాను కావాలని గాయపరచలేదని, తన తప్పేం లేదని అంటున్నారు టీచర్. హోం వర్క్ బుక్ తీసుకు రాలేదని తాను కర్రతో కొట్టానని, పొరపాటున కంటిపై తగిలిందన చెబుతున్నారు. తన తప్పు లేకపోయినా తనపై కేసు పెట్టారని అంటున్నారామె. అటు తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డకు గట్టి దెబ్బ తగిలిందని, అందుకే తాము కేసు పెట్టామని అంటున్నారు. స్కూల్ యాజమాన్యం మాత్రం ఈ విషయంలో చేతలెత్తేసింది. తల్లిదండ్రుల్ని పిలిచి వారికి నచ్చజెప్పడంలో యాజమాన్యం విఫలం కావడంతో టీచర్ పై కేసు పెట్టేవరకు పరిస్థితి వెళ్లిందని అంటున్నారు. మొత్తమ్మీద ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. పిల్లలను దండించే విషయంలో ఉపాధ్యాయులు ఓసారి వెనకా ముందూ ఆలోచించుకోవాలని తేలిపోయింది.