Loan App Harassments: లోన్ యాప్‌ల పేరు వింటేనే జనాల గుండెల్లో వణుకు పుడుతోంది. తీసుకున్న అప్పు అంతా చెల్లించినా ఇంకా బకాయిలు ఉన్నాయంటూ వేధిస్తున్నారు. ఎప్పుడు చెల్లిస్తారంటూ ఫోన్ చేసిన నరకం చూపిస్తున్నారు. డబ్బు చెల్లించాలంటూ పీకల మీద కత్తి పెట్టినట్లు వేధిస్తున్నారు.  ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఫోన్లు, మెసేజ్‌లతో ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూపిస్తున్నారు.  లోన్‌యాప్‌ ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు ఆగడం లేదు. నిబంధనలు ఉల్లంఘించి జరిమానా పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడమే కాకుండా, బెదిరింపులతో ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తున్నారు.

  


తాజాగా పెద్దపల్లి జిల్లాలో ఓ యువకుడు లోన్ యాప్‌ నుంచి అప్పుడ తీసుకున్నాడు. అయితే వాయిదాల పద్దతిలో పూర్తిగా చెల్లించాడు. కానీ యాప్ నిర్వాహకుల వేధింపులు మాత్రం ఆగలేదు. ఇంకా అప్పు ఉందని, డబ్బు చెల్లించాలని కాల్స్ చేస్తూ, మెస్సేజ్లు చేస్తూ నరకం చూపించారు. డబ్బు కట్టకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు గురిశారు. దీంతో వారి వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.  


వివరాలు.. లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. ఆన్‌లైన్ లోన్ నిర్వాహకుల వేధింపులు తాళలేక సింగరేణి కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు  గ్రామానికి చెందిన వంశీకృష్ణ (27) సింగరేణిలో ఉద్యోగం చేస్తూ పెద్దపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఆర్థిక అవసరాల నేపథ్యంలో ఆన్‌లైన్లో రూ.3 లక్షలు రుణం తీసుకున్నాడు. అయితే దాన్ని వాయిదా పద్దతిలో ఇదివరకే చెల్లించాడు. రుణం మొత్తం చెల్లించినా కానీ మరలా 3 లక్షలను చెల్లించాలంటూ నిర్వాహకులు ప్రతిరోజు ఫోన్ చేసి వేధించే వారు.


డబ్బు కట్టపోతే ఎలా వసూలు చేసుకోవాలో తెలుసునంటూ బెదరించసాగారు. దీంతో లోన్ తీర్చే మార్గం లేక గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల వల్లే వంశీకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపించారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పెద్దపెల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  


గత నెలలో వైజాగ్ యువకుడు ఆత్మహత్య
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక వైజాగ్‌కు చెందిన యువకుడు గత నెలలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కంచరపాలెం కప్పరాడ ప్రాంతానికి చెందిన గున్న హేమంత్‌(30) అనే యువకుడు ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతకాలం క్రితం లోన్ యాప్స్ నుంచి కొంత రుణం తీసుకున్నాడు. అయితే.. సమయానికి డబ్బులు కట్టలేక పోయాడు. కొంతమొత్తమే తిరిగి చెల్లించగలిగాడు. డబ్బులు వచ్చాక మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని అనుకున్నాడు. నిర్వాహకులు అతడ్ని వేధించడం మొదలుపెట్టారు.  


తీవ్ర మనస్థాపానికి గురైన హేమంత్ బిర్లాకూడలి ప్రాంతంలో ఉన్న తన స్నేహితుని ఇంటికి వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. రాత్రి స్నేహితులు ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుల ద్వారా తన తనయుడు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న తండ్రి గున్న శ్రీనివాసరావు.. తన కొడుకు మృతిపై కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.