Money Scam In Hyderabad: ఆన్ లైన్ లావాదేవీలు పెరుగుతున్న క్రమంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఓ ఎస్బీఐ బ్రాంచ్‌లో పేదల పేరుతో ఖాతాలు ఓపెన్ చేసి దాదాపు రూ.175 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఆయా ఖాతాల్లో లావాదేవీలపై అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు, బ్యాంకు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని షంషీర్‌గంజ్ ఎస్బీఐ బ్రాంచ్‌లో (Shamsheerganz SBI Branch) దాదాపు రూ.175 కోట్ల అక్రమ లావాదేవీలను తాజాగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు. వీటిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.


క్రిప్టో కరెన్సీ ద్వారా..


నిందితులు పేదల పేరుతో ఆరు నకిలీ ఖాతాలు సృష్టించి రెండు నెలల్లో భారీగా లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. వివిధ బ్యాంకు ఖాతాదారుల నుంచి పెద్ద ఎత్తున నకిలీ బ్యాంకు ఖాతాలకు నగదు జమ అయినట్లు తెలిపారు. ఆయా ఫేక్ ఖాతాల్లో జమ అయిన నగదును క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయ్‌కు తరలించినట్లు చెప్పారు. కొంత డబ్బును హవాలా ద్వారా తరలించారు. ఆరు అకౌంట్లలోకి 600 కంపెనీలతో లింక్స్ ఉన్నట్లు సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ భారీ స్కాంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తోంది.


Also Read: Nalgonda News: నల్గొండ జిల్లాలో దారుణం - కన్నతల్లి గొంతు కోసి చంపేసిన తనయుడు, ఆపై తానూ ఆత్మహత్య